జమ్ము-కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భారీ హిమపాతం చోటుచేసుకొని 10మంది పోలీసులు గల్లంతైన ఘటనలో ముగ్గుర్ని వెలితీశారు. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారికి సమీపంలోని జవహర్ సొరంగ ఉత్తర ద్వారం వద్ద గురువారం అకస్మాత్తుగా మంచు చరియలు విరిగిపడి గురువారం సాయంత్రం భారీ హిమపాతం చోటుచేసుకుంది. దీంతో అక్కడే పోలీస్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న10 మంది పోలీసులు మంచులో కూరుకుపోయినట్లు వార్తలు వెలుడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు రక్షణ చర్యలు చేపట్టి, శుక్రవారం ముగ్గురు పోలీసులను వెలికితీశాయి. మిగిలిన ఏడుగురినీ రక్షించేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. బలమైన గాలులు వీస్తూ, మంచు కురుస్తుండటం ఆ ప్రాంతంలో సహాయక చర్యలకు అడ్డంకిగా మారిందని అధికారులు తెలిపారు. బుధవారం నుంచి కశ్మీర్ లోయలో భారీగా మంచు కురుస్తోంది. కుల్గాం, దక్షిణ కశ్మీర్లో రానున్న 24గంటలూ అధికంగా మంచు కురవనుందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. కొన్ని జిల్లాల్లో అయిదు అడుగులకు పైగా మంచు పేరుకుపోయింది.