ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బదులుగా.. కేంద్రం కొత్త ప్లాన్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 08:57 PM

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా నష్టాల్లో కొనసాగుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)ను మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే సెయిల్‌లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకుండా సెయిల్‌లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. విలీనం జరిగితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణను సెయిల్ నిర్వహిస్తుంది. అలాగే అప్పుల నుంచి బయటపడేసేందుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. దీనితో పాటు రుణాల చెల్లింపు కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను విక్రయించే ఆలోచన కూడా కేంద్రం చేస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.


ప్రస్తుతం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెయిల్‌లు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులుగా శాశ్వత పరిష్కారం కోసం ఈ రెండింటినీ విలీనం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు వెల్లడించారు. అలాగే రుణాల నుంచి బయటపడేందుకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 1500 నుంచి 2000 ఎకరాల భూములను ఎన్‌ఎండీసీకి విక్రయించే ప్రతిపాదనలు, బ్యాంకు రుణాల వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని గతంలో నిర్ణయించగా.. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ బదులుగా విలీనం ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.


మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తిని పెంచేందుకు రూ.2500 కోట్లు నిధులు కేటాయించాలని కేంద్రం ఇటీవలే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముడిపదార్థాల కొరత కారణంగా స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి తగ్గింది. ముడిసరుకు కొరతతో స్టీల్ ప్లాంట్‌లోని రెండు ఫర్నేసులలో ఉత్పత్తి నిలిపేశారు. ఈ నేపథ్యంలో ఫర్నేసులను తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిధులు కేటాయించింది. నవంబర్ నాటికి ఫర్నేసులలో ఉత్పత్తి ప్రారంభించాలని.. ముడిసరుకును సైతం సరఫరా చేస్తామని తెలిపింది. అలాగే కేటాయించిన నిధుల వినియోగం బాధ్యతలను ఎస్బీఐకు అప్పగించింది. ఇక ఉత్పత్తి తగ్గించిన నేపథ్యంలో కొంతమంది సిబ్బందిని కూడా ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు డిప్యుటేషన్ మీద పంపాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com