ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్‌కు భారత్ ఆయుధాల మళ్లింపు.. రాయిటర్స్ కథనంపై స్పందించిన కేంద్రం

national |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 10:46 PM

రష్యాతో యుద్దం చేస్తోన్న ఉక్రెయిన్‌‌.. భారత్‌లో తయారైన ఆయుధాలను వినియోగిస్తోందంటూ వచ్చిన కథనంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇది పూర్తిగా అవాస్తవమని, ఊహాజనితమని, తప్పుదోవ పట్టించేదిగా ఉందని... సైనిక, ద్వంద్వ వినియోగ సామగ్రి ఎగుమతుల్లో అంతర్జాతీయ నిబంధనలు అనుసరించడంలో భారత్‌పై ఇప్పటివరకు ఎటువంటి మచ్చ లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇదే అంశంపై మీడియా అడిగి ప్రశ్నలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ సమాధానం ఇస్తూ.. ఆయుధాల విక్రయంలో అంతర్జాతీయ నిబంధనలను భారత్ ఉల్లంఘించినట్టు అవాస్తవాలను ప్రచారం చేసేలా ఉందని అన్నారు.


కాగా, రష్యా-ఉక్రెయిన్‌ యద్ధం విషయంలో భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తోంది. చర్చలు, సంప్రదింపుల ద్వారా సంఘర్షణకు ముగింపు పలకాలని ఇరు దేశాలకు పదే పదే సూచిస్తోంది. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన శతఘ్ని తూటాలు ఉక్రెయిన్‌ వినియోగిస్తోందని రాయిటర్స్‌ వెలువరించిన కథనంతో కలకలం రేగింది. భారతీయ ఆయుధ తయారీ సంస్థలు నుంచి షెల్స్‌ను కొనుగోలు చేసిన ఐరోపా కస్టమర్లు.. వాటిని ఉక్రెయిన్‌కు మళ్లించారని అందులో పేర్కొంది. ఈ అంశంపై రష్యా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. ఆ వాణిజ్య కార్యకలాపాలను అడ్డుకునేందుకు భారత్‌ ఎటువంటి చర్యలు తీసుకోలేదని సంబంధిత వర్గాలను ఉటంకించింది.


ఉక్రెయిన్‌కు భారత్ ఆయుధాలు చేరుతున్న అంశం గురించి జులైలో విదేశాంగ మంత్రి జైశంకర్‌తో జరిగిన సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గియ్ లవ్రోవ్ ప్రస్తావించినట్టు భారత అధికారుల వెల్లడించినట్టు నివేదిక తెలిపింది. అయితే, భారత విదేశాంగ, రక్షణ శాఖ అధికారులు దీనిపై స్పందించడానికి నిరాకరించాయని పేర్కొంది. ఇదే అంశంపై ఈ ఏడాది జనవరిలో రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు భారత్ ఎటువంటి ఆయుధాలను అమ్మడం లేదని ఉద్ఘాటించారు.


కానీ, ఉక్రెయిన్ వినియోగిస్తోన్న షెల్స్‌లో స్వల్ప మొత్తంలో భారత్‌లో తయారైన ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు, రక్షణ రంగ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయని కథనంలో వివరించింది. అంతేకాదు, ఉక్రెయిన్‌కు భారత్‌లో తయారైన పేలుడు పదార్థాలను పంపుతోన్న ఐరోపా దేశాల్లో ఇటలీ,చెక్ రిపబ్లిక్ ఉన్నాయని చెప్పడం గమనార్హం. యూరోపియన్ యూనియర్ కాకుండా ఐరోపాలో కీవ్‌కు పెద్ద సంఖ్యలో ఆయుధ సహకారం ఆ రెండు దేశాల నుంచే అందుతోందని చెప్పింది. దీనిపై తాము ఉక్రెయిన్, ఇటలీ, స్పెయిన్, చెక్ రిపబ్లిక్ రక్షణ శాఖలను సంప్రదిస్తే.. స్పందించడానికి నిరాకరించాయిని రాయిటర్స్ కథనం పేర్కొంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com