ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టువీడిన వైద్య విద్యార్థులు.. రేపటి నుంచి విధుల్లోకి.. కానీ, చిన్న మెలిక!

national |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 10:45 PM

కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ 40 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తోన్న వైద్య విద్యార్థులు ఎట్టకేలకు పట్టువీడారు. ఆందోళన విరమించి, శనివారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. కానీ, ఓపీ సేవలు, ఎంపికచేసిన ఇతర ముఖ్య సేవలకు మాత్రం దూరంగా ఉంటామని షరతు విధించారు. తమ భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా లభించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని విరమించుకుంటామని వైద్య విద్యార్థులు స్పష్టం చేశారు. చర్చల్లో తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో వైద్యులు సమ్మె విరమించారు. ఇదే సమయంలో తుఫాను కారణంగా దక్షిణ బెంగాల్‌లో వరదలు సంభవించడంతో ప్రజారోగ్యాన్ని దృష్ట్యిలో ఉంచుకుని వైద్యులు వెనక్కితగ్గారు.


గురువారం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రెండోసారి బుధవారం నాడు వైద్య విద్యార్థులతో జరిగిన చర్చల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి డిమాండ్లను అంగీకరించిన సీఎస్.. భద్రతకు సంబంధించి వారి నుంచి సూచనలు తీసుకున్నారు.


డ్యూటీ గదులు, వాష్‌రూమ్‌లు, సీసీటీవీలు, అలారాలు, మహిళా పోలీసులు సహా భద్రతా సిబ్బంది నియామకం, రాత్రి వేళల్లో నిఘా మొబైల్ పోలీసు బృందాలు, సెంట్రల్ హెల్ప్‌లైన్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ శుక్రవారం తెల్లవారుజామున ప్రిన్సిపల్ సెక్రటరీకి సీఎస్ లేఖ రాశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని వైద్య సంస్థల వద్ద భద్రతను సమీక్షించాలని కూడా అందులో ఆదేశించారు.


మరోవైపు, పాక్షికంగా విధుల్లో చేరడం వల్ల తాము ఆందోళన విరమించనట్టు కాదని వైద్యులు స్పష్టం చేశారు. ‘అవసరమైతే, మేము మళ్లీ సమ్మెలోకి వెళ్తాం’ అని జూనియర్ డాక్టర్ల ప్రతినిధి చెప్పారు. హత్యాచార బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. శుక్రవారం సీబీఐ కార్యాలయం ఉన్న సీజీఓ కాంప్లెక్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం సమ్మెను విరమించనున్నారు. కాగా, దీనికి ముందు జూనియర్ డాక్టర్లతో చర్చలకు మమతా బెనర్జీ చేసిన ప్రయత్నాలు మూడుసార్లు విఫలమయ్యాయి. చివరకు సోమవారం ఆమె నివాసంలో దాదాపు 6 గంటల పాటు మొదటి విడత చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఐదు డిమాండ్లను ఉంచగా.. వాటిలో మూడు తక్షణమే పరిష్కరిస్తున్నట్టు దీదీ ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com