ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రైతులకు.. అక్టోబర్ ఒకటి నుంచే మొదలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 10:01 PM

ఏపీలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. అక్టోబర్ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు తెలిపింది. అక్టోబర్ ఒకటి నుంచి ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ, సహకార, మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులతో నాదెండ్ల మనోహర్ వర్క్ షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖరీఫ్ ధాన్య కొనుగోళ్లు అక్టోబర్ ఒకటి నుంచి జరపనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమచేస్తామని తెలిపారు.


మరోవైపు రైతు పండించిన ప్రతి గింజా కొనే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామన్న మంత్రి మనోహర్.. ధాన్యం అమ్మకం, మిల్లుల ఎంపికలో రైతుకే స్వేచ్ఛ ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి అడుగులో పారదర్శకంగా వ్యవహరిస్తూ.. ప్రతీ రైతుకీ భరోసా ఇస్తామని తెలిపారు. ఇక ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం పెద్ద సంఖ్యలో లారీలను సిద్ధం చేసిందన్నారు. అలాగే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ ఏర్పాటు చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. టీడీపీ కూటమి వంద రోజుల పాలనలో రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. వైసీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన 1700 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.


మరోవైపు ఏఐఐబీ బ్యాంక్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం భేటీ అయ్యారు. ఏపీలోని రోడ్ల పరిస్థితిపై వారితో చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినకుండా అధునాతన పరిజ్ఞానం ఉపయోగించాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీకీ తావులేదని.. ఎక్కువ కాలం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్ల నిర్మాణంపై కాంట్రాక్టర్లకు నియమావళి ఉండాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇక పనులు వేగంగా జరిగేలా చొరవ తీసుకోవాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. పల్లెలలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను ఏషియన్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు సమకూరుస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com