ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం.. తెరపైకి పవన్ కళ్యాణ్ సంచలన డిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 08:20 PM

దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఎపిసోడ్ చర్చనీయాంశమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఈ అంశంతెరపైకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతవుల కొవ్వు కలిసిందని సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు. ఈ వ్యాఖ్యలపై అధికార టీడీపీ, ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. నేతలు ప్రమాణ చేద్దాం సిద్ధమా అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.


తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన ట్వీట్‌పై పవన్ స్పందించారు. ఈ లడ్డూ ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని.. వైఎస్సార్‌‌సీపీలో హయాంలో ఉన్న టీటీడీ పాలకమండలి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం దారుణమని.. ఇది అందరి మనోభావాలనూ దెబ్బతీసిందన్నారు.


అలాగే పవన్ కళ్యాణ్ ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇకపై ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మరక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారితో జాతీయస్థాయిలో చర్చ జరగాలి అన్నారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.


గత ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసిందని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ మేరకు గుజరాత్‌కు చెందిన నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) కాఫ్‌ లిమిటెడ్‌ సంస్థ రిపోర్టు తెరమీదకు వచ్చింది. లడ్డూ ప్రసాదాల తయారీకి ఉపయోగించిన నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని.. అందులో పాలకు సంబంధించినవి కాకుండా మిగిలిన కొవ్వులు కలిపి ఉన్నట్లు ఆ టెస్టుల్లో తేలిందన్నారు. ఈ లడ్డూ ప్రసాదం అశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు తెలిపారు.


తిరుమల లడ్డూ వివాదంపై రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ కూడా స్పందించారు. ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపిన అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.


తిరుమల లడ్డూలో చేపనూనె వంటివి కలిపినట్లు తేలిందని.. ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్ర, దాడిగా భావిస్తున్నాము అన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాలని.. తిరుమల బాలాజీ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు ఆ దేవాలయానికి వెళ్లి.. లడ్డూ ప్రసాదం స్వీకరిస్తుంటారని గుర్తు చేశారు. వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డూ ప్రసాదం ఘటన ఉందని.. విచారణ జరపించాల్సిందే అన్నారు సతేంద్ర దాస్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com