ఏపీ సీఎం చంద్రబాబు పరిపాలనను ఉద్దేశించి ఎక్స్(ట్విట్టర్)లో ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సొల్హెమ్ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత దిగ్గజ ముఖ్యమంత్రిని కలిశాను అంటూ ట్వీట్లో తెలిపారు. గుజరాత్లోని రీ ఇన్వెస్ట్ ఫోరమ్లో సీఎం చంద్రబాబుతో బేస్ను టచ్ చేయడం చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారని, ఆయన ఏపీని కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని.. తాను ఖచ్చితంగా భావిస్తున్నానని ఎరిక్ సొల్హెమ్ అన్నారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలో సిలికాన్ వ్యాలీగా మార్చడానికి చంద్రబాబు నాయకత్వం వహించారు, గ్లోబల్ ఐటీ నాయకులతో కలిసి పని చేశారు. విశాలమైన ఇన్ఫోసిస్ క్యాంపస్ను స్థాపించారు. హైదరాబాద్ను భారతదేశంలోని అత్యంత ఆధునిక నగరాల్లో ఒకటిగా చంద్రబాబు మార్చారు. అందమైన ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఏవిధంగా సహాయం చేయాలనే కీలక విషయాలపై చర్చించాం. గ్లోబల్ రెన్యూవబుల్స్ అలయన్స్, అంతర్జాతీయ గ్రీన్ ఎనర్జీ కమ్యూనిటీకి చెందిన ఇతర భాగస్వాములు అత్యుత్తమ ప్రపంచ నైపుణ్యాన్ని తీసుకురావడానికి, పెట్టుబడిదారులను సమీకరించడానికి మేం సహాయం చేస్తాం’’ అంటూ ఎరిక్ సొల్హెమ్ ట్వీట్ చేశారు.