సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హమీ మేరకు దీపావళి నుంచి పథకం అమలు కోరుతూ రూ. 894.92కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఇదే సమయంలో ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇచ్చేందుకు రూ.2684.75 కోట్లు ఖర్చవుతుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ఈమేరకు జీవో ఆర్టీ నెంబర్ 38ని ప్రభుత్వ ఎక్స్ అఫీషియె కార్యదర్శి జి వీరపాండ్యన్ జారీ చేశారు. దీపం పథకం ద్వారా దీపావళి పండుగకు ఇళ్లల్లో వెలుగులు తెస్తుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘‘మహిళల ఇంటి ఖర్చులు తగ్గించడానికి ఉమ్మడి రాష్ట్రంలో ‘దీపం’ పథకం ఆనాడు అమల్లోకి తెచ్చాం. ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్ల ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుంది. వంట గ్యాస్ కోసం ఖర్చు చేసే డబ్బులను గృహిణులు ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. అందుకే ఆర్థిక సమస్యలు ఉన్నా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టాం’’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.