భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. నిన్న (ఆదివారం) ఒక్క రోజే కనీసం 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటితో కలుపుకొని గత 14 రోజుల వ్యవధిలో మొత్తం 350 విమానాలకు ఫేక్ బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో అత్యధికం సోషల్ మీడియా ద్వారా వచ్చాయని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి.తాజాగా.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగోవిమానానికి ఇవాళ (సోమవారం) బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
అప్పటికే విశాఖపట్నంలో ఇండిగో విమానం ల్యాండ్ అయింది. విమానాన్ని ఎయిర్ పోర్టు అధికారులు పరిశీలించారు. అనంతరం ఇండిగో ఫ్లైట్ విశాఖపట్నం నుంచి తిరిగి ముంబై బయలుదేరి వెళ్లింది. అయితే.. గతంలో తమ సంస్థకు చెందిన 15 విమానాలకు భద్రతా పరమైన అలర్ట్లు వచ్చాయని, క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత విమానాల కార్యకలాపాలను తిరిగి కొనసాగించామని అకాశ ఎయిర్ తెలిపింది. ఇండిగోకు చెందిన 18 విమానాలకు, విస్తారాకు చెందిన 17 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం 50కిపైగా విమానాలతోపాటు తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి. భద్రతా నిబంధనల మేరకు రెండు విమానాలను దారి మళ్లించారు. మిగిలిన వాటిలో తనిఖీలు చేపట్టి ఎటువంటి ప్రమాదం లేదని తేల్చారు. దీంతో గత రెండు వారాల్లో బెదిరింపులు వచ్చిన విమానాల సంఖ్య 350 దాటింది. తిరుపతిలో మూడు రోజులుగా హోటళ్లకు వస్తున్న బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఆరు హోటళ్లకు హెచ్చరికలు రాగా ఆయా హోటళ్లకు వెళ్లి, వాటిని ఖాళీ చేయించి, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసి ఏమీ లేవని తేల్చారు. అలాగే తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సహా ఇస్కాన్ టెంపుల్కు కూడా బాంబులు పెట్టినట్టు సమాచారం రావడంతో అధికారులు భద్రత చర్యలు చేపట్టి అణువణువు పరిశీలించారు.