‘‘స్టీల్ ప్లాంట్ పరిరక్షణే మా విధానం, మా నినాదం’’ అని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం నాడు ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకుని సాగర్ నగర్ బీచ్లో స్వచ్చ శుభ్రతను ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ నా రాజీనామాపై మీవి చవకబారు విమర్శలు’’ అంటూ వైసీపీపై మండిపడ్డారు. వైసీపీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారని ప్రశ్నించారు.ఈ ఐదు సంవత్సరాలు గాడిదలు కాశారా అంటూ విరుచుకుపడ్డారు. తాము వచ్చిన మూడు నెలలోనే మాంగనీస్ గనులు కేటాయించామని తెలిపారు. ‘‘స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశాను. మీరు ఏం చేసారో చెప్పాలి... రాజీనామాల వల్ల ఉపయోగం లేదంటే అది మీ అవివేకం. స్టీల్ ప్లాంట్ కోసం 75 మంది రాజీనామాలు చేస్తే అది మనకి వచ్చింది. రాజీనామాలు చేస్తే ప్రభుత్వాలు కదలి వస్తాయి. రాజీనామాల వల్ల ఉపయోగం లేకపోతే జగన్ ఎందుకు రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళ్లారు. ఎందుకు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తామని చెప్పారు. రాజీనామాల గురించి మాట్లాడే వారు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి’’ అంటూ హితవుపలికారు.