వివాహమైన 13 రోజులకే ఓ యువకుడు అలిపిరి కాలినడక మార్గంలో గుండెపోటుతో మృతిచెందాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని తిరుత్తణికి సమీపంలో ఉన్న కీసలంకు చెందిన నరేష్(32) బెంగళూరులో స్థిరపడ్డాడు. అక్కడి వైట్ఫీల్డ్లోని ఓ ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈనెల 11వ తేదీన స్వాతి అనే యువతితో వివాహమైంది. ఈక్రమంలో తిరుమలేశుడి ఆశీస్సుల కోసం భార్యతోపాటు తన తల్లిదండ్రులు, అత్తమామలు ఇలా దాదాపు 20 మంది కుటుంబీకులతో శుక్రవారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులందరినీ వాహనాల్లోనే తిరుమలకు వెళ్లమని చెప్పాడు. తాను మాత్రం మొక్కు ఉందని అత్త కుమారుడితో కలిసి మధ్యాహ్నం 12.30 గంటలకు అలిపిరి నుంచి కాలినడక ప్రారంభించాడు. అప్పటివరకు బాగానే ఉన్న నరేష్.. 2,300 మెట్టు వద్దకొచ్చేసరికి చాతీ పట్టుకుని కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న బంధువు, భక్తులు పైకి లేపే ప్రయత్నం చేశారు. మరోవైపు అంబులెన్స్కు సమాచారమిచ్చారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరేష్ మృతి చెందాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు.