ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాయుగుండం ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో వానలు.. బీ అలర్ట్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 09:53 PM

ఏపీవాసులకు అలర్ట్.. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వాయుగుండం ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయంగా.. పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ దీపానికి ఆగ్నేయంగా.. బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకి ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. ఈ వాయుగుండం రేపటికల్లా తుపానుగా మారుతుందని.. ఈ తుపాను 24వ తేదీ రాత్రి లేదా 25వ తేదీ శుక్రవారం ఉదయం పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.


తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో అక్టోబర్ 24 గురువారం, అక్టోబర్ 25 శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని అంచనా వేసింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో అక్టోబర్ 23వ తేదీ బుధవారం కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.


మరోవైపు తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అలజడిగా ఉంటుందని.. అక్టోబరు 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.


మరోవైపు తుపాను నేపథ్యంలో ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. విపత్తు నిర్వహణ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతపురం జిల్లాలో పండమేరు వాగు ఉధృతితో జలమయమైన కాలనీల పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద నీటిలో మునిగిన కాలనీల్లో అందుతున్న సహాయక చర్యలతో పాటు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను పర్యవేక్షించారు. 25వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ప్రజలను అప్రమత్తం చేయాలని.. సహాయ చర్యలు నిరాటంకంగా సాగించాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com