ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 07:44 PM

ఏపీ రాజధాని అమరావతి విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అమరావతి నిర్మాణం దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కూడా అమరావతిలో పర్యటించి నిర్మాణాలను పరిశీలించారు. ఏపీలో ఏ అంటే అమరావతి.. పీ అంటే పోలవరం అని సాక్షాత్తూ సీఎం చెప్పారంటేనే ప్రస్తుతం ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుందనేదీ అర్థమవుతుంది. అయితే అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయంలో మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. రాజధాని నిర్మాణంపై కీలక అప్‌డేట్ ఇచ్చారు.


ఈ ఏడాది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ చెప్పారు. నాలుగేళ్లలోపు రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం రూ.60 వేల కోట్లు అవసరమవుతుందని మంత్రి అంచనా వేశారు. అయితే అభివృద్ధిని ఒక్కచోటే పరిమితం చేయడం తమ ప్రభుత్వం ఉద్దేశం కాదన్న నారాయణ.. రాజధానితో పాటుగా 26 జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన క్రెడాయ్ సౌత్ కాన్ -2024 కార్యక్రమానికి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ.. నిర్మాణ రంగంలో బిల్డర్ల అనుమతుల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తెస్తామన్నారు. అలాగే సింగిల్ విండో అనుమతులపైనా చర్చిస్తామన్నారు. ఇక సాధ్యమైనంత త్వరగా రాజధాని నిర్మాణం పూర్తిచేసి.. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని నారాయణ అన్నారు.


మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. కేంద్రం సహకారంతో రాజధానిని నిర్మించే ప్రయత్నాల్లో పడింది. ఇప్పటికే కేంద్రం బడ్జెట్‌లో అమరావతికి రూ.15000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు కూడా అమరావతిలో పర్యటించారు, సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. అటు అమరావతిలో ఇప్పటికే నిర్మించిన కట్టడాల పటిష్టతపైనా ఐఐటీ బృందాలు ఇప్పటికే పరిశీలన జరిపాయి. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందివ్వనున్నాయి. ఇక అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రస్తుతం నడుస్తుండగా.. ఇవి పూర్తైన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com