ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగాళాఖాతంలో తుఫాను.. ఐఎండీ రెడ్ అలర్ట్.. రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 11:24 PM

బంగాళాఖాతంలోని మధ్య అండమాన్ సముద్రంలో సోమవారం నాడు ఏర్పడిన అల్పపీడనం బలపడి మంగళవారం ఉదయం వాయుగుండంగా మారింది. బుధవారం నాటికిది మరింత బలపడి తుపానుగా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. అక్టోబరు. 24న ఒడిశాలోని పూరీ- పశ్చిమ్ బెంగాల్‌లోని సాగర్ ఐల్యాండ్ మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుఫానుకు ‘దన’ అనే పేరును సూచించారు. తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తా, తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.


తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల రాకాసి అలలు తీరంపై విరుచుకుపడతాయని హెచ్చరించింది. ఒడిశాలోని కేంద్రపడ, జగత్సింగ్‌పూర్, బాలేశ్వర్‌ జిల్లాలకు ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలతో నదుల్లో ప్రవాహం ఒక్కసారిగా పెరిగి.. వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం ఒడిశా తీరానికి తుఫాను చేరువవుతుందని వివరించింది. ఈ తుఫాను ప్రస్తుతం పశ్చిమ-వాయువ్యవ దిశగా పయనిస్తోందని తెలిపింది.


ఇది ప్రస్తుతం పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 730 కి.మీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ ఆగ్నేయంగా 770 కి.మీ, ఖేపుపరా (బంగ్లాదేశ్)కి ఆగ్నేయంగా 740కి.మీ. దూరంలో కేంద్రకృతమై ఉంది. ‘బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఉష్ణోగ్రత 29 నుంచి 32 డిగ్రీల మధ్య ఉంది.. ఇది సాధారణం కంటే అధికం.. ఈశాన్య బంగాళాఖాతంలో ఉష్ణమండల తుఫాను ఉష్ణ సంభావ్యత 100 kj/cm2గా కంటే అధికంగా ఉంది.. ఇది తుఫాను ఏర్పడటానికి అనుకూలంగా ఉంటుంది’ అని ఐఎండీ అధికారులు చెప్పారు.


తుఫాను తీరం దాటడానికి ముందు అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఒడిశాలోని గోపాల్‌పూర్‌ నుంచి బాలేశ్వర్‌ వరకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. సందర్శకులు సముద్రంలో స్నానాలు చేయరాదని హెచ్చరికలు జారీ చేసింది. గంజాం, పూరీ, జగత్సింగ్‌పూర్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఖుర్దా, కేంద్రపడ, భద్రక్, బాలేశ్వర్, జాజ్‌పూర్, కటక్, ఢెంకనాల్, అనుగుల్, మయూర్‌భంజ్‌ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఒడిశాలోని 14 జిల్లాలకు రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.


తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలపై అధికంగా ఉంటుందని ఐఎండీ అంచనా. అక్టోబరు 24 & 25న శ్రీకాకుళం,విజయనగరం,మన్యం,అల్లూరి, విశాఖపట్నం,అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచి, సముద్రం అలజడిగా ఉంటుందని, అక్టోబరు 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది. దీంతో పాటు తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటకలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com