ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో ఒకేరోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 09:59 PM

అమరావతి డ్రోన్ సమ్మిట్ -2024లో భాగంగా అమరావతిలో నిర్వహించిన డ్రోన్ షో అదరహా అనిపించింది. విజయవాడ పున్నమిఘాట్‌లో జరిగిన డ్రోన్ షో.. వీక్షకులతో విజిల్స్ కొట్టించింది. అలాగే పలు ప్రపంచ రికార్డులు కూడా నమోదయ్యాయి. మొత్తంగా అమరావతి డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ఈ ప్రపంచ రికార్డులకు సంబంధించిన ధ్రువపత్రాలను గిన్నిస్ బుక్ ప్రతినిధులు.. కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు చేతికి అందజేశారు. అమరావతిలో నిర్వహించిన డ్రోన్ షోలో.. డ్రోన్ల ద్వారా పలు ఆకృతులను సృష్టించారు. విమానం. జాతీయ జెండా, బుద్ధుడి ఆకృతులను డ్రోన్ల ద్వారా రూపొందించారు. లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్, లార్జెస్ట్ ల్యాండ్ మార్క్, లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్, అలాగే డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ, ఏరియల్ లోగోతో ఐదు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి.


దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షోగా విజయవాడ డ్రోన్ షో నిలిచింది. జాతీయ డ్రోన్‌ సమ్మిట్‌లో భాగంగా పున్నమి ఘాట్‌ దగ్గర ఈ డ్రోన్ షో ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్ షోను ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడుతో కలిసి ప్రారంభించారు. దేశంలోనే తొలిసారి 5,500 డ్రోన్లతో ఈ షోను ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్ షోను చూసేందుకు వీక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కృష్ణాతీరం మొత్తం జనసంద్రంగా మారింది. ఈ డ్రోన్‌ షో చూసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం ఐదు ప్రాంతాల్లో డిస్‌ ప్లేలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా డ్రోన్ షోతో పాటుగా.. లేజర్‌ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక విజేతలకు చంద్రబాబు చెక్కులు అందించారు.


మరోవైపు అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా.. ఈ డ్రోన్ షో నిర్వహించారు. రెండు రోజుల పాటుగా ఈ డ్రోన్ సమ్మిట్ జరగనుంది. సదస్సులో భాగంగా ప్యానెల్ డిస్కషన్లు, డ్రోన్ల ప్రదర్శన ఉంటుంది. అలాగే డ్రోన్ పాలసీకి సంబంధించిన ముసాయిదా పత్రం కూడా ఆవిష్కరించనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, డీఎఫ్‌ఐ, సీఐఐ భాగస్వామ్యంతో అమరావతి డ్రోన్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సదస్సు ద్వారా దేశానికి డ్రోన్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని.. ఈ రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com