ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గతానికి భిన్నంగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు

sports |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 11:17 PM

పారిస్ వేదికగా నేడు (జూలై 25న) ఒలింపిక్ క్రీడలు మొదలు కాగా.. మరుసటి రోజున ఒలింపిక్ గేమ్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను స్టేడియంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి సంప్రదాయానికి భిన్నంగా పారిస్ మీదుగా ప్రవహించే సీన్ నది తీరంలో ఒలింపిక్స్ వేడుకల ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. సాధారణంగా ఆరంభ వేడుకల్లో అథ్లెట్లు ట్రాక్ మీద పరేడ్ నిర్వహిస్తారు. కానీ ఈసారి గతానికి భిన్నంగా బోట్ల మీద రానున్నారు. దాదాపు 10,500 మంది అథ్లెట్లు 100 బోట్లలో పరేడ్ నిర్వహిస్తారు. ఐకానిక్ బ్రిడ్జిలు, ల్యాండ్ మార్క్‌లను దాటుకుంటూ.. సీన్ నదిలో ఆరు కిలోమీటర్ల మేర అథ్లెట్ల బోట్ పరేడ్ కొనసాగనుంది.


లైవ్ ఎందులో చూడొచ్చంటే..


స్థానిక కాలమానం ప్రకారం జూలై 26న సాయంత్రం 7.30 గంటలకు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటలు దాటేంత వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను 6 లక్షల మంది ప్రత్యక్షంగా తిలకించేలా ఫ్రాన్స్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మన దేశంలోని క్రీడాభిమానులు స్పోర్ట్స్ 18 నెట్ వర్క్ ద్వారా ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీని లైవ్‌లో చూడొచ్చు. అలాగే జియో సినిమా యాప్, వెబ్ సైట్ల ద్వారానూ లైవ్‌లో చూడొచ్చు.


32 క్రీడాంశాలు.. 329 ఈవెంట్లు..


పారిస్ ఒలింపిక్ గేమ్స్ జులై 25 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఈసారి మొత్తం 32 క్రీడాంశాల్లో 329 ఈవెంట్లు జరగనుండగా.. 206 దేశాల నుంచి 10 వేల మందికిపైగా అథ్లెట్లు పాల్గొననున్నారు. ఒలింపిక్స్‌ క్రీడల్లో అమెరికా, చైనా హవా కొనసాగుతోంది. ఈసారి కూడా ఈ రెండు దేశాలకు చెందిన అథ్లెట్లు ఎక్కువ సంఖ్యలో పతకాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఈసారి అత్యధికంగా 21 మంది భారత షూటర్లు పోటీలో ఉన్నారు.


భారత్ నుంచి 117 మంది..


భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు ఈసారి ఒలింపిక్స్‌ బరిలో దిగుతున్నారు. అయితే 72 మంది భారత అథ్లెట్లు తొలిసారి ఒలింపిక్స్ బరిలో దిగుతుండటం గమనార్హం. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి అత్యధికంగా 121 మంది అథ్లెట్లు పోటీ పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో 2024 ఒలింపిక్ గేమ్స్ నిలవనుంది. పారిస్ ఒలింపిక్స్‌కు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించలేకపోయినప్పటికీ ఈసారి 117 మంది భారత అథ్లెట్లు పోటీలో ఉండటం గమనార్హం.


పది దాటనున్న పతకాల సంఖ్య?


అత్యధికంగా హర్యానా నుంచి 29 మంది అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ బరిలో ఉండగా.. పంజాబ్ నుంచి 19 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు. ఈసారి భారత అథ్లెట్లు 16 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. 2020లో టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించడమే ఇప్పటి వరకూ అత్యధికం. కాగా ఈసారి పదికిపైగా పతకాలు వస్తాయనే అంచనాలున్నాయి.


వీరిపై అంచనాలు..


ప్రస్తుత భారత బృందంలోని నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, పీవీ సింధు, లవ్లీనా బోర్గోహైన్‌తోపాటు భారత పురుషుల హాకీ జట్టు గతంలో ఒలింపిక్స్ పతకాలు గెలిచారు. 2016 ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధు.. 2020లో కాంస్యం గెలిచింది. గత ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రాపై ఈసారి భారీ అంచనాలున్నాయి. షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ త్రివర్ణ పతాకం చేబూని భారత్ తరఫున ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com