ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు,,,,స్కూళ్లు, కాలేజీలకు హాలీడే

national |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 10:04 PM

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆ రాష్ట్ర ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, సరస్సులు నీటితో కళకళలాడుతున్నాయి. ఇక రాజధాని ముంబై నగరం జలవిలయంలో చిక్కుకుంది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్ అయిన ఉన్నతాధికారులు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ముంబై నగరంలో పడుతున్న కుండపోతన వానల నేపథ్యంలో విద్యా సంస్థలకు హాలీడే ప్రకటిస్తూ బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేస్తూ భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలతో ముంబై వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మరోవైపు.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ముంబై.. అంతా జలమయం అయింది. ఈ క్రమంలోనే పలు విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.


ఈ నేపథ్యంలోనే ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. వర్షం కారణంగా విమాన సర్వీసులు ఆలస్యం అవుతున్నాయని.. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయల్దేరేముందు ఫ్లైట్‌ స్టేటస్ చెక్ చేసుకోవాలని ఇండిగో సంస్థ సూచించింది. స్పైస్‌జెట్ సంస్థ కూడా ఇదే రకమైన ప్రకటన చేసింది. ఇక క్యాన్సిల్ అయిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు మొత్తం టికెట్ డబ్బులను తిరిగి ఇచ్చేయనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.


ప్రస్తుతం ముంబైలోని పలు ప్రాంతాల్లో వరద ఉద్ధృతి తీవ్రంగా నెలకొంది. ఇక ముంబై నగరానికి నీటిని సరఫరా చేసే 7 సరస్సుల్లో రెండు సరస్సులు నిండుకుండల్లా మారాయి. సాయన్, చెంబూర్‌, అంధేరీ ప్రాంతాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అంధేరీ సబ్‌వేలోకి వరద నీరు చేరిపోవడంతో అధికారులు దాన్ని మూసివేశారు. శుక్రవారం ఉదయం వరకు ముంబైకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.


పూణేలో భారీ వర్షాలు.. ఆ ప్రాజెక్టుతో భయం


ఇక పూణే నగరంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు పూణే నగరంలో భారీ వర్షాల కారణంగా నలుగురు మృత్యువాత పడ్డారు. వారిలో ముగ్గురు గురువారం (జూలై 25) ఉదయం డెక్కన్‌ జింఖాన వద్ద కరెంట్‌ షాక్‌కు గురై చనిపోయినట్లు అధికారులు తెలిపారు. పూణే, చించ్వాడ ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఖదక్‌ వాస్ల డ్యామ్‌లో భారీ నీరు వచ్చి చేరుతుండటంతో 7 గేట్లు తెరిచి 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు పూణే జిల్లా కలెక్టర్‌ సుహాస్‌ దివాసే వెల్లడించారు.


అవసరమైతే పూణేలోని ప్రజలను హెలికాప్టర్ల ద్వారా తరలిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూణేలో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ, నేవీ బృందాలను రంగంలోకి దింపారు. పూణేలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం చేస్తుండటం, అతి భారీ వర్ష సూచన ఉండటంతో.. పూణేలో తాజా పరిస్థితుల గురించి, పూణే వాతావరణం గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. దీంతో పూణే రెయిన్ న్యూస్ గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది. మహారాష్ట్రతో పాటు చంఢీగర్, త్రిపుర, రాజస్థాన్, బీహార్‌లో పూణే వర్షాల వార్తల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com