ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవిష్యత్ తరాలపై భారమ మోపవద్దు... మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 09:59 PM

ఉచిత పథకాల అమలుతో భవిష్యత్ తరాలపై భారం మోపవద్దని దేశంలోని చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా రాష్ట్రాల్లోని వివిధ వర్గాలకు ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల్లో స్థిరత్వం తేవాల్సిన అవసరం ఉందని తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలు అవుతున్న ఉచిత బస్సు ప్రయాణాల గురించి ఆమె ప్రస్తావించారు. ఇలా ఉచిత పథకాల అమలుతో భవిష్యత్ తరాలపై భారం మోపవద్దని సూచించారు. ఎన్నికల సమయంలో గెలుపు కోసం.. అన్ని రాజకీయ పార్టీలు.. ప్రజలకు హామీ ఇచ్చే ఉచిత పథకాలను ప్రస్తుతం సమర్ధించుకోవచ్చు కానీ.. ప్రజల అభిప్రాయం ప్రకారం పన్ను చెల్లింపుదారులకు జవాబుదారీగా ఉండాలని హితవు పలికారు.


కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న నగదు బదిలీ పథకం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలపై ఆమె స్పందించారు. ఇక ఫ్రీ బస్ పథకంతోపాటు మరో ఐదు హామీలతో గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. ప్రస్తుతం కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడండి.. అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు లేవని చెప్పకుండా.. ఎన్నికల హామీలను తప్పనిసరిగా గౌరవించాలని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి.. అదే సమయంలో పురుషులపై బస్సు ప్రయాణ ఛార్జీలు రెట్టింపు చేయడం వల్ల ఆ కుటుంబాలపైనే భారం పడుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.


ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాలపై నిజాయితీతో కూడిన చర్చ జరగాలని ఆమె పిలుపునిచ్చారు. ఉచితాలపై ఆయా ప్రభుత్వాలు నిజాయితీగా చర్చ పెట్టాలని అన్నారు. ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకం ఆమోద యోగ్యం కాదని తేలియక కాదని.. ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాన్ని సమర్ధించుకోవాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తరచుగా ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల మధ్య తేడాలు చెప్పడం చాలా కష్టం అని చెబుతున్నారని కేంద్రమంత్రి వెల్లడించారు.


ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కొందరు వ్యక్తుల నుంచి పన్నులు వసూలు చేసి వాటిని మరికొందరికి పంచుతున్నారని.. నిజంగా ఉచిత పథకాలకు అర్హులైన వారికే అవి దక్కాలని తెలిపారు. ఏది ఏమైనా.. ప్రభుత్వాలకు ప్రజల నుంచి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం నుంచి తాగునీరు, విద్యుత్, ప్రాథమిక ఆరోగ్యం, విద్యారంగాలకు సరిపడా నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల నుంచి ఎవరైనా లబ్ధి పొందొచ్చు.. కానీ ఇతర పన్ను చెల్లింపుదారులపై అది ప్రతికూల ప్రభావం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఉంటుందని స్పష్టం చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com