కెన్యా రాజధాని నైరోబీలో గత రెండేళ్లుగా మహిళల మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ జరపగా.. ఓ సీరియల్ కిల్లర్ ఈ మహిళలను కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా హతమార్చినట్లు వెల్లడైంది. అయితే చంపేసిన తర్వాత మహిళల మృతదేహాలను పోలీస్ స్టేషన్కు అతి దగ్గర్లోని డంపింగ్ యార్డులో పడేసినట్లు తేలడం మరింత దుమారం రేపుతోంది. మహిళలను హత్య చేయడం వారిని డంపింగ్ యార్డులో పడేయడం సంచలనంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడు 33 ఏళ్ల కొల్లిన్స్ జమైసీ కాలుషాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో తాను 42 మంది మహిళలను హత్య చేసినట్లు కొల్లిన్స్ జమైసీ అంగీకరించాడు.
మనిషి ప్రాణం అంటే కొల్లిన్స్ జమైసీ ఏమాత్రం విలువ లేదని అధికారులు చెబుతున్నారు. అయితే అతడు మొదట 9 మంది మహిళల మృతదేహాలను నైరోబీలోని ముకురూ మురికివాడ చెత్తకుప్పలో ఇటీవల గుర్తించారు. ఆ ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే ఓ పాడుబడిన ఇంట్లో ఆ నిందితుడు కొల్లిన్స్ జమైసీ అద్దెకు ఉండేవాడని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ కేసుల విచారణ ప్రారంభించిన పోలీసులకు జమైసీపై అనుమానం వచ్చింది. దీంతో అతడు ఉండే ఇంట్లో సోదాలు నిర్వహించగా.. భారీ ఎత్తున టేపు, నైలాన్ సంచులు, రబ్బర్ గ్లౌజులు కనిపించాయి. మహిళలను చంపిన తర్వాత వారి మృతదేహాలను పడేసే సమయంలో వాటిని ఉపయోగించినట్లు గుర్తించారు.
2022 నుంచి ఈ ఏడాది జులై 11 వ తేదీ వరకు జమైసీ.. ఏకంగా 42 మంది మహిళలను వలవేసి లొంగదీసుకొన్నాడని.. ఆ తర్వాత వారిని అతి దారుణంగా హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. చంపిన తర్వాత మహిళల మృతదేహాలను గుర్తుపట్టకుండా ఛిద్రం చేసి సమీపంలో భారీ డంపింగ్ యార్డ్లో పడేసేవాడని పేర్కొన్నారు. ఇక ఆ మహిళల్లో అతని భార్య కూడా ఉన్నట్లు జమైసీ అంగీకరించాడని చెప్పారు. అతడి ఇంట్లో కొన్ని సెల్ ఫోన్లను కూడా అధికారులు గుర్తించారు.
మహిళలు వరుసగా కనిపించకుండా పోతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ.. 26 ఏళ్ల జోసఫ్ వైనో అనే యువతి ముకురు ప్రాంతంలో అదృశ్యం అయిందని ఆమె చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తన అక్క ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి ముందు ఎవరో ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమె కోసం గాలింపు చేపట్టగా.. ఆ భారీ డంప్ యార్డులోని చెత్తలో వెతికించింది. అక్కడ ఛిద్రమైన మహిళల అవయవాలు బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళల మృతదేహాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి.
డంపింగ్ యార్డులో సంచుల్లో మహిళల శరీర భాగాలు నరికిన స్థితిలో ఉన్నాయి. ఆ మృతదేహాలపై ఎలాంటి బుల్లెట్ గాయాలు కూడా లేవని పోలీసులు తెలిపారు. వారిలో ఒకరిని గొంతు కోసి చంపినట్లు తేలింది. ఇప్పటి వరకు డీఎన్ఏ పరీక్షల్లో రెండు మృతదేహాలను మాత్రమే గుర్తించారు. మిగిలినవి బాగా కుళ్లిపోవడంతో గుర్తింపు ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. అయితే పోలీస్ స్టేషన్కు దగ్గర్లోనే మృతదేహాలను పడేయడం.. 2 ఏళ్లుగా మహిళల మిస్సింగ్ కేసులు నమోదవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.