ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌కు భారత్ నోటీసులు.. అసలేంటీ సింధూ నదీ జలాల ఒప్పందం

national |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 11:04 PM

దేశ విభజన తర్వాత భారత్, పాక్ మధ్య వివిధ అంశాలపై కొన్ని ఒప్పందాలు జరిగాయి. అయితే అందులో అతి ముఖ్యమైనది రెండు దేశాల మధ్య నదీ జలాల పంపిణీ. ఇక 1960లో చేసుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించాల్సిందిగా ఈ సందర్భంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ సింధూ నదీ జలాల ఒప్పందం చాలా పాతది అని.. అందులో మార్పులు చేయాలని సూచిస్తున్నట్లు పాకిస్తాన్‌కు పంపించిన నోటీసులో భారత్ పేర్కొంది. అయితే సింధూ నదీ జలాల ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితులు పూర్తగా మారిపోయాయని.. అందువల్ల దానిలో మార్పులు చేయాలని భారత్ పట్టుబడుతోంది. అయితే ఈ నోటీసులపై పాక్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం గమనార్హం.


రెండు దేశాల మధ్య 1960లో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించడానికి ఆగస్ట్ 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఆర్టికల్ 12(3) ప్రకారం అధికారిక నోటీసులు పంపించింది. అప్పటి నుంచి ఇరు దేశాల పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని.. అందుకే ఒప్పందంలో కూడా మార్పులు చేయడం అవసరమని ఆ నోటీసుల్లో భారత్ తెలిపింది. అయితే ఈ నోటీసులు పంపి 2 వారాలు దాటినప్పటికీ.. పాకిస్తాన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. గత 64 ఏళ్లలో భారతదేశ జనాభా భారీగా పెరిగిందని.. అదే సమయంలో దేశ వ్యవసాయ అవసరాలు కూడా గణనీయంగా మారిపోయాయని తెలిపింది. అందుకే భారత్‌లో పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని భారత్ పట్టుబడుతోంది.


దేశవిభజనతో విడిపోయిన భారత్ పాకిస్తాన్‌ దేశాల మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించి కుదిరిన ఒప్పందమే ఈ సింధూ నదీ జలాల ఒప్పందం. 1960 సెప్టెంబర్ 19వ తేదీన కరాచీలో జరిగిన ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు సంతకాలు చేశారు. అనంతరం ఈ ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి చొరవ తర్వాత.. భారత్, పాక్ మధ్య నీటి పంపిణీపై ఉద్రిక్తతలు తగ్గాయి. 1969లో సంతకం చేసిన సింధు జల ఒప్పందం ప్రకారం.. తూర్పు భాగంలోని బియాస్, రావి, సట్లెజ్ అనే 3 నదులపై నియంత్రణ భారత్‌కు ఉంటుంది. ఇక సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ పాకిస్తాన్‌కు అప్పగించారు. నీటి వినియోగం, నీటి పరిమాణానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.


అయితే టిబెట్ నుంచి ప్రవహించే ఈ సింధు నదిపై భారత్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, చైనా లాంటి 4 దేశాల మధ్య వివాదం ఉంది. 1947లో భారత్, పాక్ విడిపోయినప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది. ఇదే సమయంలో ఈ సింధు నదికి సంబంధించి భారత్‌, పాక్‌ల మధ్య అనేక వివాదాలు ఉన్నాయి. పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పేందుకు 1948లోనే ఆ దేశానికి భారత్ నీటి సరఫరాను నిలిపివేసింది. దీంతో ఐక్యరాజ్యసమితికి పాక్ విజ్ఞప్తి చేసింది. అనంతరం.. ఐక్యరాజ్యసమితి చొరవతో ప్రపంచ బ్యాంకు 1954లో ఈ నదీ జలాల ఒప్పందాన్ని కుదిర్చినా.. 1960లో సంతకాలు చేశారు.


ఒప్పందం తర్వాత నీటి భాగస్వామ్యంపై తలెత్తిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని.. శాశ్వత సింధు కమిషన్‌ను ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం.. సింధు నదిలో 20 శాతం నీటిని భారత్ దేశీయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అదే సమయంలో పాక్‌ 80 శాతం నీటిని ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత నీటి వినియోగం విషయంలో నిబంధనలను ఉల్లంఘించాయని రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే 2020లో సింధు జలాల ఒప్పందం జరిగి 60 ఏళ్లు పూర్తయింది. కరోనా కారణంగా 2020 మార్చిలో వర్చువల్ సమావేశానికి భారత్ పట్టుబట్టింది. అయితే పాకిస్తాన్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కోరింది. దీంతో సమావేశం జరగలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com