ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసలేంటీ ఒకే దేశం ఒకే ఎన్నిక.. లాభమా, నష్టమా

national |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 11:21 PM

ఒకే దేశం ఒకే ఎన్నిక. 2014 లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు బీజేపీ నేతలు చెబుతున్న అంశం. ఈ క్రమంలోనే దేశంలోని ఎన్నికల నిర్వహణలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ జమిలీ ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు తీసుకురావడం అంత తేలికైన పని కాదని కేంద్ర ప్రభుత్వానికి తెలియని విషయమేమీ కాదు. అయితే ఈ క్రమంలోనే సమావేశాల నిర్వహణ.. అదే సమయంలో ఒకే దేశం ఒకే ఎన్నికలపై పరిశీలనకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయడం మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే గతంలో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగినా.. వివిధ కారణాలతో మార్పులు జరిగి ఒక్కోసారి ఒక్కో రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి.


అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి?


దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడమే జమిలీ ఎన్నికలు లేదా ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు కూడా ఒకే సమయంలో ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగితా రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో ఆయా శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి.


జమిలీ ఎన్నికలు అంత తేలిక కాదు


అయితే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అమల్లోకి తీసుకురావడం అంత తేలికైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ సవరణలకు లోక్‌సభలోని 543 స్థానాల్లో కనీసం 67 శాతం మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. అటు రాజ్యసభలోని 245 సీట్లలో 67 శాతం ఈ బిల్లును సమర్థించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.


అధికార కూటమికి తగినంత బలం లేదు


అంటే జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందాలంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లును సమర్థిస్తూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం దేశంలోని 10 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలు మరో 6 రాష్ట్రాల్లో పాలన చేస్తున్నాయి. లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి దాదాపు 333 సీట్ల బలం ఉంది. 543 స్థానాలకు గానూ ఈ 333 సీట్లు అంటే 61శాతానికి సమానం.. అయితే మరో 6 శాతం ఓటింగ్‌ను సంపాదించడం ఎన్డీఏ కూటమికి కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక అటు రాజ్యసభలో కేవలం 38 శాతం సీట్లు మాత్రమే ఎన్డీఏకు ఉండటంతో అసలు ఈ జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.


అసలు జమిలీ ఎన్నికల అవసరం ఏంటి?


రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చులు చేస్తోంది. వేర్వేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్లే భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటోందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇలా ప్రజా ధనం వృథా అవుతోందని దాన్ని అరికట్టేందుకే జమిలీ ఎన్నికలను తీసుకురావాల్సిన అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. 2019 లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ఒక్కో రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్ల దాకా వెచ్చిస్తోంది. వీటికి తోడు ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు చేసే ఖర్చు కూడా లెక్కపెడితే ఆశ్చర్యపోవాల్సిందే. 2019 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు కలిపి దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేశాయని అప్పట్లో సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అనే సంస్థ తెలిపింది. దీంతో భారత దేశ చరిత్రలోనే 2019 లోక్‌సభ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయి.


జమిలీ ఎన్నికల వల్ల ప్రయోజనాలు


లోక్‌సభ, అసెంబ్లీలకు కలిపి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే.. భారీగా ప్రభుత్వ ధనం వృథా తగ్గి.. ఖర్చులు కలిసి వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అధికారులు ఎన్నికల విధుల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటే పరిపాలనపై ప్రభావం పడుతుంది.. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే.. సమయం ఆదాతో పాటు రెండుసార్లు ఎన్నికలు జరగకుండా వారు పరిపాలనపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు తరచూ ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారడం కూడా తగ్గుతుంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటర్లు ఒకేసారి వచ్చి ఓటింగ్‌ వేయడం వల్ల పోలింగ్‌ శాతం కూడా పెరుగుతుందని లా కమిషన్‌ వెల్లడించింది.


జమిలీ ఎన్నికలతో ఇబ్బందులు 


అయితే ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సహా ఇతర పార్లమెంటరీ ప్రొసీజర్లను కూడా సవరించాల్సి ఉంటుంది. దీని కోసం రాష్ట్రాల అంగీకారం కూడా కావాల్సి ఉంటుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అమల్లోకి వస్తే ప్రచారంలో జాతీయ అంశాలే అధిక ప్రాధాన్యత కలిగి ఉండి.. స్థానిక అంశాలు, సమస్యలు కనిపించకుండా పోతాయని ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా భయపడుతున్నాయి. దీనికి తోడు ఎన్నికల ఖర్చులో కూడా జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పోటీపడాల్సి రావడం మరింత ఇబ్బందిగా ఉంటుందని భావిస్తున్నాయి. అయితే 2015లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే 77 శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమికి ఓటు వేయనున్నారని తేలింది. అసెంబ్లీకి పార్లమెంట్‌కు వేర్వేరుగా నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకొనే అవకాశాలు 61శాతానికి తగ్గినట్లు వెల్లడైంది.


గతంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు


స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1967 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దుకావడం, 1970 లో ఏడాది ముందే లోక్‌సభ రద్దు చేయడంతో ఈ విధానం మారిపోయింది. అయితే 1983 లో ఎన్నికల కమిషన్‌ మరోసారి జమిలీ ఎన్నికల ప్రతిపాదనను తెరపైకి తెచ్చినా.. ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. 1999 లో లా కమిషన్‌ నివేదిక ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని లేవనెత్తినా అది ఆచరణలోకి రాలేదు. 2016 లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జమిలీ ఎన్నికల ఆలోచనను ప్రతిపాదించగా.. 2017 లో నీతి ఆయోగ్‌ కసరత్తు చేసింది. 2019 లో ఈ అంశంపై వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోదీ సమావేశం ఏర్పాటు చేయగా.. కాంగ్రెస్‌ సహా చాలా ప్రతిపక్షాలు హాజరు కాలేదు. అయితే 2022 లో జమిలీ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనని సీఈసీ సుశీల్‌ చంద్ర ప్రకటించారు. 2022 డిసెంబర్‌లో జమిలీ ఎన్నికలపై లాకమిషన్‌ వివిధ పార్టీలు, ఈసీ, అధికారులు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలను ఆహ్వానించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com