ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాత్రికే రాత్రి జగన్ భద్రతను ప్రభుత్వం తగ్గించింది.... వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 08:31 PM

జగన్‌కు రాత్రికే రాత్రి ప్రభుత్వం సెక్యూరిటీని తగ్గించేసిందని.. జగన్ వినుకొండ పర్యటనకు భద్రత కల్పించడంతో పోలీసులు, ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని వైఎస్సార్‌‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి పాత బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనాన్ని కేటాయించారని.. అది ఆగిపోవడంతో మార్గమధ్యలో ఆయన మరో వాహనం ఎక్కాల్సి వచ్చిందంటున్నారు.


వినుకొండ మార్గంలో జగన్ కాన్వాయ్‌కి అడుగడుగునా ఆంక్షలు విధించి వేధించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కాన్వాయ్‌ని ఎక్కడికక్కడ ఆపేయడంతో పాటు ఆయన వెంట కార్లలో వస్తోన్న పార్టీ నేతలు, కార్యకర్తలను కారణం లేకుండానే అడ్డుకున్నారని చెబుతున్నారు.


పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ యువ‌జ‌న‌ విభాగం నేత ర‌షీద్‌ని.. జిలానీ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం న‌డిరోడ్డుపై దారుణంగా హత్య చేయడం కలకలంరేపింది. ఈ హత్యపై రాజకీయంగా దుమారం రేగింది. ఈ ఘటనపై టీడీపీ, వైఎస్సార్‌సీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రషీద్ హత్య ఘటన గురించి తెలియగానే జగన్ గురువారం హుటాహుటిన బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. రషీధ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈరోజు ఉదయం వినుకొండకు వెళ్లారు.


మరోవైపు రహీష్ హత్యతో పాటూ ఏపీలో జరుగుతున్న పరిణామాలపై జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని.. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే 31 హత్యలు, 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయని ఆరోపించారు. టీడీపీ నేతల వేధింపుల వల్ల 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని.. శాంతి భద్రతల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.


ప్రధానికి రాసిన లేఖలో వినుకొండ రషీద్ హత్య కేసు అంశాన్ని ప్రస్తావించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. రెడ్ బుక్ పేరుతో ఓ మంత్రి దాడుల్నిప్రోత్సహిస్తున్నారని.. దీంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయన్నారు. ఈ ఘటనలపై నివేదించేందుకు వీలైన రోజు అపాయిమెంట్‌ ఇవ్వాలని ప్రధాని మోదీని జగన్ కోరారు. అలాగే దాదాపు 27 మంది ఐఏఎస్‌లు, 24 మంది ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కన పెట్టారని లేఖలో ప్రస్తావించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com