ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కశ్మీర్‌లో సైనిక వాహనాలపై ఉగ్రదాడి.. రెండు రోజుల వ్యవధిలో రెండోసారి

national |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 10:07 PM

గత నెల రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో జరుగుతోన్న ఉగ్రదాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలో రెండో సారి సైనిక వాహనాలపై దాడికి తెగబడ్డారు. కథువా జిల్లాలో జరిగిన ఈ దాడిలో ఒక జవానుకు గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అదనపు బలగాలను అక్కడకు పంపినట్టు అధికారులు వెల్లడించారు. కుల్గామ్‌ జిల్లాలో ఆదివారం రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులు కాగా.. మరో సైనికుడు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే కథువాలో ముష్కరులు దాడికి పాల్పడ్డారు. కుల్గామ్‌లోని మోడెర్గామ్ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో సీఆర్పీఎఫ్, ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అక్కడకు చేరుకుని, శనివారం సాయంత్రం నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రాంరంభించాయి. ఈ ఘటనలో ఓ ఇంటిలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. సైన్యం కాల్పుల్లో పూర్తిగా ఆ ఇల్లు ధ్వంసం కాగా.. ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.


ఇదే సమయంలో కుల్గామ్‌లోని ఫ్రైజల్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. అక్కడ జరిగిన భీకర కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఘటనలో ఓ సైనికుడు కూడా అమరుడయ్యాడు. హతమైన ఉగ్రవాదులను యావర్ బషీర్ దార్, జహీద్ అహ్మద్ దార్, తవాహీద్ అహ్మద్ రాథర్, షకీల్ అహ్ వనీగా.. మోడర్గామ్‌లో హతమైనవారిని ఫైజల్, అదిల్‌గా గుర్తించారు. మోడర్గామ్‌ ఉగ్రవాదుల కాల్పుల్లో పారా కమాండో లాన్స్ నాయక్ ప్రదీప్ నాయక్.. ఫ్రైజల్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన హవల్దార్ రాజ్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. ఇక, రాజౌరీ జిల్లాలో ఆర్మీ క్యాంప్ సమీపంలో జరిగిన మరో ఘటనలో ఓ జవాన్ గాయపడ్డారు. మంజకోటే ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. అయితే, ఈ విషయాన్ని ఇప్పటి వరకూ ఆర్మీ వర్గాలు ద్రువీకరించలేదు. జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుత ఉగ్రవాద కార్యకలాపాల వెనుక పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న రెసిస్టెంట్ ఫ్రంట్, నిషేధిత లష్కరే తొయిబా ఉన్నట్టు సైనిక వర్గాలు పేర్కొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com