ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. తెలంగాణ గవర్నర్ చంద్రబాబును అందుకే కలిశారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 08:24 PM

తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్‌లకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ (జార్ఖండ్ ఫుల్‌టైమ్) తెలుగు రాష్ట్రాలకు ఫుల్ టైమ్ గవర్నర్‌గా వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో గవర్నర్‌గా ఉన్న ఆయన.. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో.. తెలంగాణకు ఇంఛార్జ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయన పుదుచ్చేరి ఇంఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఇటీవల రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఆసక్తికరంగా మారగా.. అప్పటి నుంచే ఈ ప్రచారం జరుగుతోంది. రాధాకృష్ణన్ ఉండవల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని కలిశారు. దీంతో సీపీ రాధాకృష్ణన్ ఏపీ టూర్‌పై సరికొత్త ప్రచారం జరుగుతోంది. ఆయన తెలుగు రాష్ట్రాలకు ఫుల్ టైమ్ గవర్నర్‌గా వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారనే ఊహాగానాలు నడుస్తున్నాయి. రాధాకృష్ణన్ జార్ఖండ్ రాష్ట్రానికి ఫుల్‌టైమ్ గవర్నర్‌‌గా ఉన్నా సరే.. కొంతకాలంగా తెలంగాణలోనే ఎక్కువశాతం నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ పర్యటనకు వెళ్లడం ఆసక్తిరేపింది. ఆ తర్వాతే సరికొత్త చర్చ మొదలైంది.


సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఢిల్లి పెద్దలకు సంకేతాలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆయనది తమిళనాడు కావడంతో.. దక్షిణాది రాష్ట్రాల్లోనే గవర్నర్‌గా కొనసాగాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే తెలుగు రాష్ట్రాల్లోనే ఫుల్‌టైమ్ గవర్నర్‌గా కొనసాగాలని ఆసక్తి ఉన్నట్లు కేంద్ర పెద్దలకు సంకేతాలు ఇచ్చారట. అయితే మరికొన్ని నెలల్లోనే ఆరు రాష్ట్రాలకు గవర్నర్‌ల పదవీకాలం పూర్తవుతోంది.. కేంద్రం ఆయా రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లను నియమించాల్సి ఉంటుంది.


ఈ ఆరు రాష్ట్రాలకు గవర్నర్‌లుగా పలువురు సీనియర్ నేతల్ని నియమించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందట. ఒకవేళ మార్పులు చేర్పులు జరిగితే.. ఏపీకి గవర్నర్‌గా వెళ్లేందుకు ఆయన సుముఖంగా ఉన్నారనే ప్రచారం నడుస్తోంది. ఇటీవల ఉండవల్లి వెళ్లిన సమయంలో చంద్రబాబుతో భేటీలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గర్నవర్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. ఆయన 2023 ఫిబ్రవరిలో బాధ్యతలు తీసుకోగా.. ఆయనకు మరో నాలుగేళ్లు సర్వీస్ ఉంది. మరి ఇలాంటి సమయంలో సీపీ రాధాకృష్ణన్‌ను ఏపీ గవర్నర్‌గా నియమించే అవకాశం ఉంటుందా లేదా అన్నది కూడా చూడాలి.


అయితే ఈ ఊహాగానాల మధ్య గవర్నర్ రాధాకృష్ణన్.. తెలంగాణలో తమిళసై గవర్నర్‌గా ఉన్న సమయంలో పెండింగ్‌లో ఉన్న 10 బిల్లుల్లో 7 బిల్లులకు ఆమోదం తెలిపారు. వీటిలో ప్రైవేట్ యూనివర్శిటీస్ బిల్లు, మైనార్టీ కమిషన్ బిల్లు, పంచాయతీ రాజ్ బిల్, తెలంగాణ ఇన్సిస్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ బిల్లు, మున్సిపల్ అమెండ్మెంట్ బిల్లు, ములుగును మున్సిపాలిటీగానే మార్చే బిల్లు, మున్సిపాలిటీలలో కోఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచే బిల్లులు ఉన్నాయి. ప్రస్తుతం రాధాకృష్ణన్‌ మూడు రాష్ట్రాల (జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి) బాధ్యతల్ని చూస్తున్నారు.. మరి కేంద్రం ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందన్నది చూడాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com