ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ బతికి ఉండుంటే.. ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండేది కాదు: రాహుల్ గాంధీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 08:21 PM

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేళ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వైఎస్సార్‌ బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మరోలా ఉండేందన్నారు. ఆయన ఉండుంటే రాష్ట్రానికి ఎలాంటి కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కాదని.. వైఎస్సార్ నుంచి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. రాజశేఖర రెడ్డి ఎప్పుడూ ప్రజల కోసమే బతికారని.. ఒక్కమాటలో చెప్పాలంటే అసలైన ప్రజా నాయకుడు అన్నారు. తాను చేసిన భారత్ జోడో యాత్రకు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రే స్ఫూర్తి అన్నారు. ఆ రోజుల్లో రాజశేఖర్‌రెడ్డి ఎండను, వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశారని గుర్తుచేశారు రాహుల్.


వైఎస్సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ.. ప్రత్యేకంగా ఓ వీడియోను ట్వీట్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని కుమార్తె షర్మిల సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు రాహుల్ గాంధీ. ఆమె నాయకత్వంలో.. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఉన్న నాయకత్వ లక్షణాలు, ధైర్యం, సిద్ధాంతాలు వైఎస్ షర్మిలలో చూశానన్నారు.


ఏపీ, తెలంగాణలో వైఎస్సార్ జయంతి కార్యక్రమం


వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.. అలాగే సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ సేవల్ని నేతలు గుర్తు చేసుకున్నారు. అలాగే ఇవాళ ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరవుతున్నారు.


ఇటు తెలంగాణలో కూడా వైఎస్ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. వైఎస్‌ఆర్‌ 75వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ దగ్గర ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు.. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అలాగే గాంధీభవన్‌లో జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com