ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు ఇంటికి మూడుసార్లు వచ్చిన ఏపీ సీనియర్ ఐపీఎస్.. నో ఎంట్రీ, గేటు దగ్గరే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 09:49 PM

ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పి సీతారామాంజనేయులు చంద్రబాబు కలిసే ప్రయత్నంలో ఉన్నారు. అమరావతిలో ఇప్పటి వరకు రెండు, మూడు సార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా మరోసారి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైదరాబాద్ వచ్చారు.. శనివారం, ఆదివారం నగరంలోనే ఉన్నారు. ఈ క్రమంలో సీతారామాంజనేయులు చంద్రబాబు నివాసం దగ్గరకు వెళ్లారు. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో చంద్రబాబు జూబ్లీహిల్స్‌లోని నివాసం దగ్గరకు సీతారామాంజనేయులు వెళ్లారు. శని, ఆదివారాల్లో మూడు సార్లు అక్కడికి వెళ్లి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే భద్రతా సిబ్బంది ఆయన్ను గేటు దగ్గరే ఆపేసి వెనక్కి పంపారు. ముందుగా అపాయింట్‌మెంట్లు, అనుమతులు లేకుండా ముఖ్యమంత్రి ఎవర్నీ కలవడం లేదని చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరగి వెళ్లిపోయారు. అంతేకాదు చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించినా నిరాకరించారు.


పి సీతారామాంజనేయులు గత ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే సీతారామాంజనేయులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అనుమతి లేకపోయినా.. సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.


సీతారామాంజనేయులు జూన్‌ 6న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి కలిసేందుకు ప్రయత్నించారు. అప్పుడు కూడా గేటు దగ్గర భద్రతా సిబ్బంది అనుమతించలేదు.. ఆయన్ను వెనక్కి పంపించేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు జూన్‌ 13న తొలిసారి వెలగపూడిలోని సచివాలయానికి రాగా.. అప్పుడు కూడా సీతారామంజనేయులు సీఎంను వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం చేశారు.. కానీ అప్పుడు కూడా అనుమతి లేదని వెనక్కు పంపించారు. తాజాగా హైదరాబాద్‌లో కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్‌మెంట్ దక్కలేదు. సీతారామాంజనేయులుతో పాటూ మరికొందరు ఐపీఎస్ అధికారులకు ప్రస్తుతం ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వలేదు.. వీరు కూడా గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారే విమర్శలు వచ్చాయి. కొందరు ఐఏఎస్ అధికారుల్ని కూడా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.


ఇదిలా ఉంటే.. ఏపీలో కొందరు ఐపీఎస్ అధికారుల తీరుపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ట్వీట్ చేశారు. 'బాధ్యతలు విస్మరించి, విధి నిర్వహణలో నేల విడిచి సాముచేసిన సీనియర్ అధికారులు రామాంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్, జవహర్ రెడ్ది తదితరుల ప్రస్తుత పరిస్థితి జాతీయస్థాయి భావి అధికారులకు గుణపాఠo కావాలి. వారి ట్రైనింగ్ లలో పాఠ్యాంశాలుగా చేర్చాలి, సమాజానికి మార్గదర్శకులిగా తీర్చిదిద్దాలి' అంటూ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com