కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పరిణామాలు బాధాకరంగా ఉన్నాయని బొత్స అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు ఉండకూడదన్నారు. అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలోనే విజయనగరం పార్టీ ఆఫీసుకు వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని, విజయనగరంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదన్నారు. చట్టానికి విరుద్ధంగా ఉన్నాయంటే చట్టపరంగానే చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ ఆఫీసుల మీద కక్ష గట్టడం సరికాదని, చట్టబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారమే నడుచుకున్నామన్నారు. ఆ జీవోల ప్రకారమే భూ కేటాయింపులు జరిగాయన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకీ, అలాగే వైయస్ఆర్ సీపీకి కూడా జరిగిందన్నారు. మిగతా పార్టీలకూ అలాగే కేటాయింపులు జరిగాయన్నారు. పార్టీ ఆఫీసులను కూల్చేయడం, బెదిరించడం తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. పార్టీ ఆఫీసుల లోపలికి వెళ్లి బెదిరించడం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుశ్చర్యలు ఎప్పుడూ జరగలేదన్నారు. ఏ పార్టీ ఆఫీసు మీదకూ, రాజకీయ నాయకుల ప్రాపర్టీల జోలికి ఎవరూ పోకూడదని, చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు. ఇలాగే వెళ్తే సివిల్ వార్ గా మారే ప్రమాదం ఉందన్నారు.