టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోయాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. వైయస్ఆర్ విగ్రహాలను, గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన శిలాఫలకాలను పనిగట్టుకుని పగులగొడుతున్నారు. శనివారం రాత్రి కర్నూలు జిల్లా కృష్ణగిరిలోని బస్టాండ్లో ఉన్న వైయస్ఆర్ విగ్రహంతోపాటు రైతు భరోసా కేంద్రం శిలాఫలకాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. విగ్రహం తల, చెయ్యి తొలగించారు. ఆదివారం ఉదయం దీన్ని చూసిన స్థానికులు నాయకులకు సమాచారం ఇచ్చారు. ఈ విధ్వంసానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీ నాయకులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాయకులు కటారుకొండ మాధవరావు, శివ, వెంకటేశ్వర్లు, ఎరుకలచెర్వు ప్రహ్లాద, వెంకటరాముడు, అమకతాడు బాలు, మాధవస్వామి, కృష్ణగిరి జయరామిరెడ్డి, హుసేన్సాహెబ్, బాలమద్ది తదితరులు ఈ చర్యను ఖండించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలోని గోవర్ధనగిరి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న వైయస్ఆర్సీపీ శిలాఫలకాన్ని శనివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.