ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాదంలో మాధురీ దీక్షిత్.. ఉగ్రలింకులున్న పాక్ వ్యక్తి ఈవెంట్‌కు ప్రమోషన్

national |  Suryaa Desk  | Published : Sat, Jun 29, 2024, 10:25 PM

సెలబ్రిటీలు తీసుకునే నిర్ణయాలు.. కొన్నిసార్లు ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌కు ఎదురైంది. పాకిస్తాన్‌కు చెందిన అమెరికన్ వ్యాపారవేత్తకు సంబంధించిన కంపెనీల ప్రమోషన్ల కోసం ప్రచారకర్తగా మాధురీ దీక్షిత్ వ్యవహరించనున్నారు అనే వార్త ప్రస్తుతం తెగ దుమారం రేపుతోంది. వచ్చే నెలలో అమెరికాలో జరగనున్న ఓ భారీ ఈవెంట్ కోసం మాధురీ దీక్షిత్ అక్కడికి వెళ్తున్నారని వస్తున్న వార్తలతో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఆ పాక్ అమెరికన్ బిజినెస్‌మెన్‌ను ఇప్పటికే కేంద్రం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన నేపథ్యంలో ఆ వ్యక్తి కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు మాధురీ దీక్షిత్ సిద్ధం కావడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


పాకిస్తాన్‌కు చెందిన అమెరికా వ్యాపారవేత్త రెహన్ సిద్ధిఖీకి భారీ వ్యాపార సామ్రాజ్యం ఉంది. దాన్ని మరింత పెంచుకునేందుకు త్వరలో టెక్సాస్‌లో ఓ భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన యాడ్‌ పేజీ ప్రస్తుతం బయటికి వచ్చింది. దానిపై మాధురీ దీక్షిత్.. ఫోటో ఉండటం వివాదానికి కేంద్ర బిందువు అయింది. ఆగస్ట్‌లో రెహన్ సిద్ధిఖీకి చెందిన కంపెనీల ప్రమోషన్‌ కార్యక్రమాన్ని టెక్సాస్‌లో నిర్వహించనున్నాడు. ఆ ఈవెంట్‌కు ప్రచారకర్తగా వ్యవరించేందుకు మాధురీ దీక్షిత్.. టెక్సాస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.


అయితే ఇప్పుడు ఇదే విషయం మాధురీ ఫ్యాన్స్‌తోపాటు.. భారతీయులు తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని.. ఒకవేళ తీసుకున్నా దాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. టెక్సాస్‌ ఈవెంట్‌కు సంబంధించి విడుదలైన పోస్టర్‌లో రెహన్‌ సిద్ధిఖీతోపాటు మాధురీ దీక్షిత్‌ ఫొటోలు ఉండటం ఈ దుమారానికి కారణం అయింది..


పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో రెహన్‌ సిద్ధిఖీకి సంబంధాలు ఉన్నాయని కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే రెహన్ సిద్ధిఖీ నిర్వహించే అన్నీ కంపెనీలను భారత్‌ బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది. దీంతో ముందుగా రెహన్‌ సిద్ధిఖీ ఎలాంటి వాడో తెలుసుకుని ఆ కార్యక్రమానికి వెళ్లాలా వద్దా అనేది మాధురీ దీక్షిత్‌ వెళ్లాలని నెటిజన్లు సూచిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై మాధురీ దీక్షిత్‌ ఇంకా స్పందించకపోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com