ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదే జరిగితే సస్పెండ్ చేస్తా.. లోకేష్‌ చెప్పగానే సీఎం చంద్రబాబు వార్నింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 01, 2024, 09:25 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం పెనుమాకలో ప్రజా వేదిక పేరుతో స్థానికులతో మాట్లాడారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పరదాల ముఖ్యమంత్రిని చూశామని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని వ్యాఖ్యానించారు. గత పాలనలో కొన్ని అలవాట్ల విషయంలో అధికారులు సెట్‌ అయ్యేందుకు కొంచెం సమయం పడుతుందని లోకేష్ అన్నారు.


కొంతమంది ఇంకా పరదాలు కడుతున్నారని లోకేష్ చెప్పగానే.. లేదు, లేదు అందరూ సెట్ అయ్యారని చంద్రబాబు స్పందించారు. ఇంకా కొంతమంది పరదాలు కట్టడం మానడంలేదని.. తాము బతిమాలి తీయిస్తున్నామన్నారు లోకేష్. వెంటనే స్పందించిన చంద్రబాబు.. మళ్లీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టినవారిని సస్పెండ్‌ చేయడం తప్ప వేరే మార్గం ఉండదని వార్నింగ్ ఇచ్చారు. అధికారులు, పోలీసులు పాత రోజుల్ని మర్చిపోవాలని.. ఒకవేళ ఈ అంశంపై ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. మొన్నటి వరకు రివర్స్‌లో నడిచే‌ బండిని సరైన మార్గంలో నడిపిస్తున్నామని.. స్పీడ్‌ పెంచడం తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి ఉందన్నారు చంద్రబాబు. మరోసారి ఆ ఆలోచన రాకూడదని.. ఒకవేళ సెట్ కాకపోతే షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అవుతారన్నారు.. అందుకు తాము సిద్ధం ఉన్నామన్నారు.


ఇప్పుడే పాలన ప్రారంభమైందని.. కాస్త స్లోగా వెళ్తున్నారని.. రాబోయే రోజుల్లో స్పీడ్ పెంచాల్సిందేనన్నారు ముఖ్యమంత్రి. మళ్లీ ఈ ప్రభుత్వంలో 1995నాటి ముఖ్యమంత్రి చూస్తారని సరదాగా వ్యాఖ్యానించారు. లోకేష్‌ కూడా అప్పటికి కుర్రాడని.. ఆయనకు కూడా ఐడియా లేదన్నారు. అప్పట్లో హైదరాబాద్‌ నుంచి బయల్దేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్‌ అలర్ట్‌ ఉండేదని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇప్పుడు అంతలా ఉండదు కానీ.. తప్పు చేస్తే మాత్రం ఎవర్నీ వదిలేది లేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సిందే అన్నారు.


మంగళగిరిలో నారా లోకేష్ గెలుపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. 2019 ఎన్నికల్లో లోకేష్‌ మంగళగిరిలో ఓడిపోయారని.. అయినా సరే మళ్లీ ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేశారన్నారు. ప్రజలందరి అభిమానం సంపాదించి.. మళ్లీ లోకేష్‌ ఇక్కడి నుంచి భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారన్నారు. 2024 ఎన్నికల్లో గాజువాక, భీమిలితో పాటు మంగళగిరిలోనూ 90వేలకు పైగా మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. తనకు కుప్పం నియోజకవర్గంలో 60వేలు మెజారిటీ వస్తే గొప్ప మెజారిటీ అనుకునేవాడినని.. కానీ మంగళగిరిలో 39 ఏళ్ల తర్వాత టీడీపీ గెలిపించారని.. అలాగే లోకేష్‌కు 92వేల మెజారిటీ రావడం ఆనందంగా ఉందన్నారు.


గతంలో మంగళగిరి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి రాని మెజారిటీ లోకేష్‌కే వచ్చిందన్నారు ఏపీ ముఖ్యమంత్రి. లోకేష్‌తో ఇంకా బాగా పనిచేయించుకోవాలని మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు సూచించారు. ఏపీ ప్రజలు చంద్రబాబు 4.0 ను చూస్తారని..రాజధానిలో భాగమైన మంగళగిరిలో అభివృద్ధిని పరుగులెత్తిస్తామని హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో.. గతంలో సీడ్ యాక్సిస్ రోడ్డు విస్తరణకు పెనుమాక ప్రజలు సహకరించలేదని గుర్తు చేశారు. ఈసారి ఎవ్వరూ అడ్డుపడకుండా సీడ్ యాక్సిస్ రోడ్డుకు పూర్తిగా సహకరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు చంద్రబాబు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com