ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీకి వంగి షేక్‌హ్యాండ్ ఇచ్చారు.. రాహుల్ గాంధీ సెటైర్లకు దీటుగా కౌంటర్ ఇచ్చిన స్పీకర్

national |  Suryaa Desk  | Published : Mon, Jul 01, 2024, 09:29 PM

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శల వర్షం కురిపించారు రాహుల్ గాంధీ. స్పీకర్ ఓం బిర్లా, రాహుల్ గాంధీ మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగింది. లోక్ సభలో మైక్ కట్ చేస్తున్నారు, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని ఆరోపిస్తూ వస్తున్న రాహుల్ గాంధీ.. ఈ క్రమంలో నేడు (జూలై 1) మరింత దూకుడు పెంచారు. స్పీకర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలో ప్రధాని మోదీకి వంగి షేక్ హ్యాండ్ ఇచ్చారని, తనతో కరచాలనం చేసేటప్పుడు మాత్రం నిటారుగా నిలబడ్డారని ఓం బిర్లాను ఉద్దేశించి అన్నారు. ఈ విమర్శలను ఓం బిర్లా సైతం తనదైన శైలిలో తిప్పికొట్టారు.


‘ప్రధాని మోదీ ఈ సభకు నాయకుడు. అంతేకాకుండా, వయసులో ఆయన నా కంటే పెద్దవారు. పెద్ద వాళ్లకు గౌరవం ఇవ్వడం నాకు కొత్తగా వచ్చిన అలవాటు కాదు. నా సమ ఉజ్జీలకు.. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను’ అని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఓం బిర్లా, రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మీరు మోదీకి వంగి షేక్ హ్యాండ్ ఇచ్చారు.. నాతో నిటారుగా నిలబడ్డారు: రాహుల్ గాంధీ


లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కొన్ని మతపరమైన వ్యాఖ్యలను కూడా చేశారు. దీంతో సభలో దుమారం రేగింది. అధికార పక్షం సభ్యులు రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అనంతరం తన ప్రసంగం కొనసాగించిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ ఎప్పుడూ సీరియస్‌గా ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. దీనికి ప్రధాని సైతం గట్టి కౌంటర్‌ ఇచ్చారు.


‘సభాపక్ష నేత అయిన ప్రధాని మోదీ విపక్షంతో ఎప్పుడూ సరదాగా మాట్లాడిన సందర్భాలులేవు. కనీసం మేం ఎదురుపడినప్పుడైనా ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించదు. మోదీజీ ఎప్పుడూ ఎందుకు సీరియస్‌గా ఉంటారో?’ అని రాహుల్‌ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి ప్రధాని మోదీ బదులిస్తూ.. ‘ప్రతిపక్ష నాయకుడిని సీరియస్‌గా తీసుకోవాలని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నాకు నేర్పించాయి’ అనడంతో సభ గొల్లుమంది. ఇలా వాద, ప్రతివాదనలతో లోక్ సభ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com