ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయ న్యాయ్‌ సంహిత్ చట్టం.. ఢిల్లీలో వీధి వ్యాపారిపై తొలి కేసు నమోదు

national |  Suryaa Desk  | Published : Mon, Jul 01, 2024, 10:41 PM

బ్రిటిష్ వలస పాలన నాటి భారత శిక్షాస్మృతి (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ్ సంహిత (బీఎన్ఎస్) ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కింద మొదటి కేసు ఢిల్లీలో నమోదయ్యింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని కమలా మార్కెట్ వద్ద ఓ వీధి వ్యాపారిపై పోలీసులు కేసు నమోదుచేశారు. రోడ్డుకు అడ్డంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడనే ఆరోపణలపై బీఎన్‌ఎస్ సెక్షన్ 285 కింద కేసు నమోదుచేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.


సెక్షన్ 285 ప్రకారం ‘ఎవరైనా, ఏదైనా చర్య ద్వారా లేదా తన ప్రమేయం లేదా బహిరంగ ప్రదేశంలో ఎవరికైనా ప్రమాదం లేదా ఆటంకం కలిగించినా లేదా గాయపరిచినా జరిమానా విధిస్తారు.. ఇది గరిష్టంగా రూ.5 వేల వరకూ ఉంటుంది’ అని చట్టంలో పేర్కొన్నారు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని రోడ్డుపై వీధి వ్యాపారి వాటర్ బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నాడు. ఆయన రోడ్డుకు అడ్డంగా స్టాల్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీనిపై పలుసార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.


న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద వీధి వ్యాపారి స్టాల్ పెట్టినట్టు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ‘‘రోడ్డుకు అడ్డంగా దుకాణం పెట్టి.. అతడు వాటర్ బాటిళ్లు, బీడీలు, సిగరెట్లు, గుట్కాలు అమ్ముతూ ప్రజలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాడు.. ఆ స్టాల్‌ను పక్కకు తీయాలని ఎస్ఐ పలుసార్లు చెప్పినా వినిపించుకోలేదు.. అటుగా వెళ్లోన్న పాదచారులను విచారణలో పాల్గొనాలని ఎస్ఐ కోరితే నిరాకరించారు. దీంతో సదరు ఎస్ఐ ఇ-ప్రమాన్ అప్లికేషన్ ఉపయోగించి వీడియో చిత్రీకరించారు’’ అని ఎఫ్ఐఆర్‌లో వివరించారు. వీధి వ్యాపారిని బిహార్‌ రాజధాని పట్నాకు చెందిన పంకజ్ కుమార్‌గా గుర్తించారు.


కాగా, అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల్లో సత్వర న్యాయం, అందరికీ న్యాయం జరిగేలా చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అయితే, కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతేడాది ఆగస్టులో ఈ మూడు బిల్లులు పార్లమెంటుకు ముందుకురాగా.. ఉభయ సభల ఆమోదం తర్వాత డిసెంబరు 25న రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారాయి. కొత్త చట్టాల్లో ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం పేర్కొనగా.. రాజద్రోహం లాంటి కొన్ని పదాలను మాత్రం తొలగించారు. అయితే, దేశానికి వ్యతిరేకంగా జరిగే దాడులను వాటి స్థానంలో చేర్చారు. పాత చట్టంలో హత్యను 302 సెక్షన్‌‌లో పేర్కొనగా.. కొత్త చట్టంలో 101 సెక్షన్‌గా పెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com