ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ కనుమరుగు.. అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు

national |  Suryaa Desk  | Published : Mon, Jul 01, 2024, 10:42 PM

బ్రిటిషర్ల హయాం నుంచి కొనసాగుతోన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ) 1872 ఇకపై కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన నూతన చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (BNSS), భారతీయ సాక్ష్య అధినియమ్‌ (BSA)లను కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ మూడు చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి ఆమోదం తర్వాత విడుదలైన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.


 ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ మూడు చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల వల్ల జీరో ఎఫ్‌ఐఆర్, నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు, ఎస్సెమ్మెస్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలతో సమన్ల జారీ వంటి అత్యాధునిక విధానాలు న్యాయవ్యవస్థలోకి వచ్చాయి. ఈ చట్టాలపై హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. బ్రిటిష్‌ వలస పాలన నాటి చట్టాలు శిక్షకు ప్రాధాన్యమిస్తే.. తాము న్యాయానికి పెద్దపీట వేశామని తెలిపారు.


‘భారతీయుల కోసం భారతీయులు ఈ చట్టాలను రూపొందించారు.. ఇక వలస పాలన నాటి మూడు చట్టాలు శాశ్వతంగా మరుగునపడతాయి.. కొత్త చట్టాల ఆత్మ, శరీరం, స్ఫూర్తి అంతా భారతీయమే’ అని అన్నారు. అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ప్రకారం.. క్రిమినల్‌ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా తప్పనిసరిగా తీర్పును వెలువరించాలి. మొదటి విచారణ జరిగిన 2 నెలల్లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యల గురించి ఈ కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వచించారు. అయితే, రాజద్రోహం అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు. అలాగే, మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక దాడులు, వేధింపులకు కొత్త అధ్యాయాన్ని చేర్చారు. దీని ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవశిక్ష విధిస్తారు.


ఐపీసీలో సంక్లిష్టంగా ఉండే కొన్ని సెక్షన్లపై గందరగోళం ఉండేది. ప్రస్తుతం వాటిని సరళతరం చేయడమే కాదు.. తగ్గించారు కూడా. ఐపీలో 511 సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలో 358కి కుదించారు. ఐపీసీలోని 6-52 సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాలను ఒకే సెక్షన్‌ పరిధిలోకి తీసుకొచ్చి.. 18 సెక్షన్లను ఇప్పటికే రద్దు చేశారు. వివాహం పేరుతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేయడం, చిన్నారులపై సామూహిక అత్యాచారం, మూకదాడి తదితర నేరాలకు ఐపీసీలో ప్రత్యేకంగా ఎలాంటి సెక్షన్లు లేకపోవడంతో గందరగోళం ఏర్పడేది. ఆ లోటును భారతీయ న్యాయ సంహితలో భర్తీచేశారు. క్రిమినల్‌ కేసుల్లో దర్యాప్తు మరింత సమర్ధంగా జరిపేందుకు వీలుగా తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్‌ నిపుణులు సంఘటన స్థలాన్ని సందర్శించడాన్ని తప్పనిసరి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com