ట్రెండింగ్
Epaper    English    தமிழ்

18 ఏళ్ల తర్వాత అన్నాచెల్లెలిని కలిపిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్

national |  Suryaa Desk  | Published : Sat, Jun 29, 2024, 10:24 PM

వాళ్లు ఇద్దరూ అన్నా చెల్లెలు. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం ఓ అనుకోని సంఘటనతో విడిపోయారు. ఆ తర్వాత సరికొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ వ్యక్తి పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా తన అన్నను ఆ చెల్లె గుర్తుపట్టింది. అనంతరం వారిని సంప్రదించి వివరాలు కనుక్కోగా.. తన అన్ననే అని తేలింది. ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా. మీరు అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన. ఉత్తర్‌ప్రదేశ్‍‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 18 ఏళ్ల క్రితం విడిపోయిన ఆ అన్నా చెల్లెలు.. ఇన్నేళ్ల తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కలిశారు.


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా ఫతేపూర్‌లోని ఇనాయత్‌పూర్ గ్రామానికి చెందిన బాల గోవింద్ అనే వ్యక్తి 18 ఏళ్ల క్రితం.. 2006లో బతుకుదెరువు కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ను వదిలేసి ముంబైకి వెళ్లాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ముంబైలో పనిచేస్తూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఇంటికి ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లేందుకు రైలు ఎక్కాడు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైలు దిగాల్సిన బాల గోవింద్.. అందుకు బదులు రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు చేరుకున్నాడు. అయితే అక్కడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాల గోవింద్‌కు రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత తన ఫ్యాక్టరీలో ఆ వ్యక్తి బాల గోవింద్‌కు ఉద్యోగం ఇచ్చాడు.


అయితే ఆ ఉద్యోగం చేసుకుంటూ బాల గోవింద్ జైపూర్‌లోనే స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులు, స్నేహితులను మరిచిపోయాడు. అక్కడే ఈశ్వర్‌ దేవి అనే మహిళను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌ ఉపయోగించే బాల గోవింద్ అందులో రకరకాల రీల్స్ పోస్ట్‌ చేస్తుంటాడు. జైపూర్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లి అక్కడ రీల్స్ చేసేవాడు. అయితే ఆ రీల్స్‌ను బాల గోవింద్ సోదరి రాజకుమారి చూసింది. ఆ రీల్స్‌లో బాల గోవింద్ పన్ను విరిగి ఉండటాన్ని గుర్తించి.. చిన్నపుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన తన అన్న అని అనుమానించింది.


అతడు తన అన్న బాల గోవింద్ అని గుర్తించింది. ఈ నేపథ్యంలోనే అతడు పోస్ట్ చేసిన మరిన్ని రీల్స్ చూసిన రాజకుమారి.. తన అన్న బాల గోవింద్ అని ధ్రువీకరించింది. వెంటనే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతడిని సంప్రదించి వివరాలు అడిగింది. దీంతో వారిద్దరూ అన్నాచెల్లెలు అని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఫోన్ నంబర్ తీసుకుని అన్నకు ఫోన్ చేసిన రాజ కుమారి.. ఇంటికి తిరిగి రావాలని కోరింది. దీంతో ఈ నెల 20 వ తేదీన అతడు తన భార్య పిల్లలతో కలిసి సొంత గ్రామానికి చేరుకున్న బాల గోవింద్.. రాజ కుమారిని 18 ఏళ్ల తర్వాత కలుసుకున్నాడు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com