ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సందిగ్ధంలో వాలంటీర్లు.. మంత్రి ఆనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 29, 2024, 10:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై సందిగ్ధత కొనసాగుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించటంతో.. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వాలంటీర్లలోనూ ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వాలంటీర్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జులై నెల పింఛన్లను ఈసారి గతం కంటే భిన్నంగా పంపిణీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. గతంలో వాలంటీర్లు పంపిణీ చేసేవారని.. అయితే ఈసారి సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు అందిస్తామని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. వాలంటీర్లను తాము ఉపయోగించడం లేదని చెప్పారు. రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.


2019 ఎన్నికల్లో విజయం తర్వాత అధికారంలోకి వచ్చాక వైసీపీ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమించి.. ప్రభుత్వ పథకాల లబ్ధిని వారి ద్వారా అర్హులైన వారికి చేరవేస్తూ వచ్చారు. పింఛన్ల దగ్గర నుంచి ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలను సైతం వారి ద్వారా పంపిణీ చేశారు. అయితే 2024 ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాల పంపిణీ వద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో వైసీపీకి మద్దతుగా సుమారుగా లక్ష మంది వరకూ వాలంటీర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని టీడీపీ కూటమి ప్రకటించింది.


తాము వాలంటీర్లకు వ్యతిరేకం కాదని.. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పదివేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో గతంలో వాలంటీర్ ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన వారు కూడా.. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. వైసీపీ నేతల బలవంతంతోనే తాము రాజీనామాలు చేశామంటూ పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా పెడుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయకపోవటంతో వాలంటీర్లలో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే జులై నెల పింఛన్లను సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయాలని నిర్ణయించటంతో ఆందోళన మరింత పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com