ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం!.. అదే జరిగితే దేశంలోనే ఫస్ట్ సీఎంగా రికార్డు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 29, 2024, 07:36 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పాలనలో ప్రత్యేకత చాటుకుంటున్నారు. గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. నాలుగోసారి గతం కంటే కాస్త భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అంటే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా పేరుతెచ్చుకున్న ఆయన.. ఈ సారి మాత్రం ప్రజల మనిషిగా, ప్రజా ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునేలా పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే ప్రతి శనివారం టీడీపీ కార్యాలయాన్ని సందర్శిస్తూ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు చంద్రబాబు. ఆ రకంగా సీఎంగా ఉంటూనే ప్రజలతో మమేకమవుతున్నారు. తాజాగా చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో సామాజిక భద్రతా పింఛన్లను పెంచిన చంద్రబాబు.. స్వయంగా తానే తన చేతులతో ఆ పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిసింది.


ఏపీలో టీడీపీ కూటమి గెలిచి అధికారంలోకి వస్తే పింఛన్లను నాలుగువేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రకటించారు. ఏప్రిల్ నెల నుంచే పింఛన్లను పెంచుతామని.. బకాయిలను కలిపి ఒకే నెలలో ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 164 చోట్ల గెలిచి అధికారంలోకి వచ్చింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, స్కిల్ సెన్సస్‌తో పాటుగా పింఛన్ల పెంపుపై తొలి సంతకాలు చేశారు. అనంతరం జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. దీంతో జులై నెలలో పెరిగిన పింఛన్లను పంపిణీ చేయనున్నారు.


పెరిగిన పింఛన్ నాలుగు వేలతో పాటుగా మూడు నెలల బకాయిలు మూడు వేలు కలిపి రూ.7000 పింఛన్ పంపిణీ చేయనున్నారు. జులై ఒకటో తేదీన సచివాలయ సిబ్బంది ఈ పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అయితే సీఎం హోదాలో తాను కూడా ఓ చోట పింఛన్ పంపిణీ చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఆందులో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ ఇంటికి వెళ్లి స్వయంగా సీఎం చంద్రబాబునే పింఛన్ డబ్బులు అందించనున్నట్లు తెలిసింది. దీంతో తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. మరోవైపు లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్ళి స్వయంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్లు అందించడం ఇదే మొదటిసారి అని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com