ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తవ్వకాల్లో బయటపడ్డ 41 వేల ఏళ్లనాటి నిప్పుకోడి గూడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 08:01 PM

ప్రపంచంలోనే అతి పురాతనమైన నిప్పుకోడి గూడు ఆంధ్రప్రదేశ్‌లో బయటపడింది. ప్రకాశం జిల్లాలో 41 వేల ఏళ్ల కిందటి ఆస్ట్రిచ్ గూడును పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. వడోదరలోని ఎంఎస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్టులు అలాగే జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా పురాతత్వ శాస్త్రవేత్తలతో కలిసి జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడింది. ప్రకాశం జిల్లాలో జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన నిప్పుకోడి గూడు లభ్యమైంది. ఈ గూడులో 9 నుంచి 10 నిప్పు కోడి గుడ్లను ఉంచినట్లు పరిశోధకులు వెల్లడించారు. సాధారణంగా ఒక్కో నిప్పుకోడి గూడు 9 నుంచి 10 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఒక్కో గూడులో ఒకేసారి 30 నుంచి 40 గుడ్లను పొదిగేందుకు వీలు ఉంటుంది. మరోవైపు అతి పురాతనమైన నిప్పుకోడి గుడ్ల పెంకులను హిమాలయాలలోని సివాలిక్ కొండలలో గుర్తించారు. ఇవి 20 లక్షల సంవత్సరాల ఏళ్లనాటివని శాస్త్రవేత్తలు తెలిపారు,


అయితే భారీ జంతువులు భారతదేశంలో ఎందుకు అంతరించిపోయాయో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. శాస్త్రవేత్తలు 40 కిలోల కంటే ఎక్కువ బరువున్న జంతువులను మెగాఫౌనాగా పరిగణిస్తుంటారు. అలాంటి మెగాఫౌనా భారతదేశంలో ఎందుకు అంతరించిపోయాయో తెలుసుకునేందుకు ఈ పక్షి గూడు కీలకంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే 3,500లకు పైగా నిప్పుకోడి గుడ్ల పెంకులను.. ఒకే ప్రాంతంలో గుర్తించడం ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే 41 వేల ఏళ్ల కిందటి నిప్పుకోడి గూడు బయటపడటం ఇదే తొలిసారని చెప్తున్నారు.


జంతుశాస్త్ర పరిభాషలో మెగాఫౌనా అంటే భారీ జంతువులు అని అర్థం. గుర్రాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు, నీటి ఏనుగులు వంటివాటిని మెగాఫౌనా కింద పరిగణిస్తూ ఉంటారు. అయితే 40 వేల ఏళ్లకిందట ప్రపంచంలోని చాలా చోట్ల ఉన్న ఇలాంటి జంతువులు అంతరించిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో దొరికిన ఈ నిప్పుకోడి గూడు.. అలాంటి జంతువులు అంతరించిపోవటానికి గల కారణాలను తెలుసుకునే ప్రక్రియలో కీలకంగా మారింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com