ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ మద్దతు కోరిన మోదీ సర్కార్.. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 08:00 PM

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 151 స్థానాల నుంచి ఏకంగా 11 సీట్లకు పడిపోయింది. ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమి 164 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే లోక్‌సభలో కూడా ఎన్డీఏ కూటమి భారీగా పెరిగింది. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఇందులో ఎన్డీఏ కూటమికి 21 సీట్లు వచ్చాయి. వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు మాత్రమే విజయం సాధించారు. ఇక కేంద్రంలో సొంతంగా బీజేపీ మెజార్టీ మార్కు దాటకపోయినప్పటికీ.. మిత్ర పక్షాలతో కలిసి నరేంద్ర మోదీ అధికారాన్ని చేపట్టారు. అయితే తాజాగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మద్దతు కోరింది. లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది.


ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల బలం ఉంది. విపక్ష ఇండియా కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఎన్డీఏ కూటమి తగినంత బలం ఉన్నా.. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమిలో లేని పార్టీలు, స్వతంత్ర్య్ ఎంపీల మద్దతు కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్‌సభ స్పీకర్‌ పదవిని ఇండియా కూటమికి దక్కకూడదని అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక కీలకంగా మారింది.


ఈ క్రమంలోనే ఎన్డీఏ, ఇండియా కూటమిలో లేని వైసీపీ మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీకి లోక్‌సభలో నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నా.. వారిని కూడా తమ అభ్యర్థి ఓం బిర్లాకే ఓటు వేసేలా బీజేపీ హైకమాండ్ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని బీజేపీ సంప్రదించింది. లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరింది. దీనికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ స్పీకర్ ఎన్నిక గురించి చర్చ జరుగుతోంది. లోక్‌సభ స్పీకర్‌ను అధికార, విపక్షాలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుండగా.. ఈసారి మాత్రం ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇందులో ఏ ఫలితం వస్తుందోనని దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com