ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నలుగురు పిల్లలుంటే ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.. ప్రధాని ప్రకటన

national |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2024, 04:50 PM

సంపాదించిన డబ్బుపై ప్రభుత్వాలకు ప్రజలు ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే చాలా మంది సంపాదించిన డబ్బుకు ఆదాయపు పన్ను కట్టడం ఎగ్గొట్టేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదాయపు పన్ను కట్టే వారికి ఐరోపా ఖండంలోని హంగేరీ ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. నలుగురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని తాజాగా వెల్లడించింది. ఎందుకంటే ఆ దేశంలో జనాభా రోజురోజుకూ తగ్గిపోతోంది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్‌లో దేశ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని గుర్తించిన హంగేరీ సర్కార్.. ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు ప్రపంచ జనాభా రోజురోజుకూ పెరుగుతుంటే.. కొన్ని దేశాలను మాత్రం జననాల క్షీణత తీవ్రంగా వేధిస్తోంది.


ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలతో హంగేరీ యువత పెళ్లిళ్లు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో భవిష్యత్‌ తరం లేకుండా పోతోంది. దీంతో వలసలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే దేశ జనాభాను మళ్లీ పెంచేందుకు అక్కడి ప్రభుత్వం రకరకాల చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది సంతానం ఉన్నవారు లైఫ్ టైమ్ ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని స్వయంగా హంగేరీ దేశ ప్రధాని విక్టోర్ అర్బన్ ప్రకటించారు.


ఐరోపా దేశాల్లో జననాలు చాలా తక్కువగా ఉన్నాయని.. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో తలెత్తిన ఈ సమస్యకు ప్రపంచ దేశాల నుంచి ప్రజలను వలసలు తీసుకురావడం పరిష్కారంగా మారుతున్నాయని హంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్ తెలిపారు. జనాభాను పెంచుకునేందుకు వలసదారులను ఆహ్వానించాల్సి వస్తోందని.. అలా కాకుండా కొత్త ఆలోచనలతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కనీసం నలుగురు అంతకంటే ఎక్కువమందిని కనే మహిళలకు తమ జీవితకాలం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కల్పిస్తామని విక్టోర్‌ అర్బన్‌ తాజాగా ప్రకటన చేశారు.


కేవలం ఇన్‌కమ్ ట్యాక్స్ మాత్రమే కాకుండా పెద్ద కుటుంబాలు పెద్ద కార్లు కొనుగోలు చేసేందుకు వీలుగా వారికి సబ్సిడీలు కూడా ఇవ్వనున్నట్లు హంగేరీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. వీటితోపాటు పిల్లలను పెంచేందుకు దేశవ్యాప్తంగా 21వేల క్రెచ్‌లను ప్రారంభించినట్లు వెల్లడించింది ఇలాంటి మినహాయింపులతో పెళ్లిళ్లు, సంతానాన్ని ప్రోత్సహించవచ్చని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.


అయితే గతంలో కూడా హంగేరీ ప్రభుత్వం ఇలాంటి ఆఫర్లు ప్రకటించింది. పెళ్లిళ్లు, జననాల రేటును పెంచేందుకు 2019లో ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. 41ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్‌ ఫోరింట్స్‌ (హంగేరీ కరెన్సీ) సబ్సిడీపై లోన్లు ఇచ్చింది. పెళ్లి తర్వాత ఆ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే ఆ లోన్‌లో మూడోవంతును మాఫీ చేస్తామని తెలిపింది. ఒకవేళ ముగ్గురు అంతకంటే ఎక్కువ సంతానం కలిగితే మొత్తం లోన్ మాఫీ చేస్తామని ఆఫర్‌ ఇచ్చింది. ప్రస్తుతం హంగేరీ జనాభా 96.4 లక్షలుగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com