ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర.. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడుల వేళ పటిష్ఠ భద్రత

national |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2024, 04:50 PM

హిమాలయాల్లోని మంచు కొండల్లో కొలువైన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో వరుసగా ఉగ్రవాద ఘటనలు జరుగుతుండటంతో అమర్‌నాథ్ యాత్రికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అధికారులు మాత్రం పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేసి.. అమర్‌నాథ్ మంచు లింగాన్ని దర్శించుకునే భక్తుల కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 29 వ తేదీన ప్రారంభం కానున్న ఈ అమర్‌నాథ్ యాత్ర కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇక అమర్‌నాథ్ యాత్రికుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు.


అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభానికి గుర్తుగా శనివారం నిర్వహించిన ప్రథమ పూజలో జమ్మూ కాశ్మీర్‌ రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌గా గవర్నర్ మనోజ్ సిన్హా మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న యాత్ర ప్రారంభం అయిన తర్వాత దేశవ్యాప్తంగా యాత్రికులకు అమర్‌నాథ్ మంచు లింగం భక్తులకు కనువిందు చేయనుందని చెప్పారు. దేవస్థానం బోర్డు, జమ్మూ కాశ్మీర్ పాలనా యంత్రాంగం యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. గత రెండేళ్లుగా అమర్‌నాథ్ యాత్రకు సౌకర్యాలు చాలా మెరుగయ్యాయని చెప్పారు. ఆలయ గుహకు వెళ్లే రహదారులకు మరమ్మతులు నిర్వహించి.. సౌకర్యవంతంగా చేసినట్లు వెల్లడించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ - బీఆర్‌ఓ కొన్నిచోట్ల రోడ్లను వెడల్పు చేసిందని తెలిపారు.


ఈసారి అమర్‌నాథ్ యాత్ర ప్రశాంతంగా జరుగుతుందని భావిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అభిప్రాయం వ్యక్తం చేశారు. అమర్‌నాథ్ యాత్రికులకు ఎప్పటిలాగే సహాయ సహకారాలను అందించాలని యాత్ర కొనసాగే మార్గంలోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. అమర్‌నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగితే అది ప్రపంచవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్‌ ఖ్యాతిని ఇనుమడింప చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం వివిధ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రారంభించారు. మరోవైపు 270 కిలో మీటర్ల శ్రీనగర్‌ - జమ్మూ జాతీయ రహదారి వెంబడి రక్షణ చర్యలను పలువురు పోలీస్‌ ఉన్నతాధికారులతో కలిసి జమ్మూ కాశ్మీర్‌ ఏడీజీపీ ఆనంద్‌ జైన్‌ సమీక్షించారు.


ఆ తర్వాత పలు కీలకమైన ప్రాంతాల్లో కమ్యూనిటీ కిచెన్‌లను, చెకింగ్‌ పాయింట్లను ఆనంద్ జైన్ తనిఖీ చేశారు. ఉగ్రవాదులు.. అమర్‌నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు ప్రయత్నించే అవకాశాలను పేర్కొంటూ నిరంతరాయంగా పటిష్ఠ రక్షణ చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అనుమానాస్పద కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని పేర్కొన్నారు. యాత్రికుల పట్ల స్నేహపూర్వక వ్యవహార శైలిని కలిగి ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడానికైనా సిద్ధంగా ఉండాలని ఏడీజీపీ ఆనంద్ జైన్‌ సూచించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com