ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు కొత్త సాంప్రదాయం.. ఇక నుంచి ప్రతీ శనివారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2024, 03:51 PM

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రమాణం చేశారు. ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు.. 5 ఏళ్ల తర్వాత మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే రెండోసారి పాలనలో సరికొత్త మార్పులు తీసుకువస్తున్నారు.


2019 లో అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ.. ఆ తర్వాత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే ప్రజలకు కొత్త కొత్త వాగ్దానాలు అందించింది. ఈ సందర్భంగానే అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతీ శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని కలిసేందుకు సమయం కేటాయిస్తానని ఆయన గతంలోనే హామీ ఇచ్చారు. అందులో భాగంగానే శనివారం తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వందల మంది ప్రజలు వారి సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు.


 ఇక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కార్యాలయానికి వెళ్లడానికి ముందే ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు బారులు తీరారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసింది. దీంతో అక్కడికి వచ్చి భారీ సంఖ్యలో బారులు తీరిన జనం దగ్గరికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత వారి వినతులు ఆయనే విని వారి నుంచి పత్రాలు స్వీకరించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచడంపై పలువురు వృద్ధులు ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగులు కొంతమంది తమకు సాయం చేయాలని కోరగా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. టీడీపీ కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి వారి సమస్యల్ని శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా జై బాబు.. సీఎం బాబు నినాదాలతో కార్యాలయం హోరెత్తింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com