ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి మరో షాక్.. విశాఖలోనూ పార్టీ కార్యాలయానికి నోటీసులు.. త్వరలో బుల్డోజర్లు ఎంట్రీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 08:05 PM

తాడేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని తెల్లారేసరికే కూల్చివేయగా.. ఇప్పుడు విశాఖలోనూ అదే సీన్ రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలోని ఎండాడలో సర్వే నంబర్ 175/4లో 2 ఎకరాల స్థలంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ కార్యాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ఈ భవనానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కార్యాలయం భవనం గోడకు అధికారులు నోటీసులు అంటించారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ భవనాన్ని కూల్చివేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎండాడలో వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేయడం గమనార్హం.


గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం భవనాన్ని సీఆర్‌డీఏ అధికారులు శనివారం (జూన్ 22) ఉదయం 5 గంటల సమయంలో బుల్డోజర్లతో కూల్చివేశారు. ఇది అక్రమ నిర్మాణమని, అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.


ఎండాడలో నిర్మిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యాలయ భవనానికి అనుమతులు లేవని జీవీఎంసీ అధికారులు తెలిపారు. నిర్మాణానికి జీవీఎంసీ అనుమతులు తప్పనిసరి కాగా.. జీవీఎంసీ నుంచి కాకుండా అనుమతులు కోసం వీఎంఆర్డీఏకు దరఖాస్తు చేశారని, అక్కడా అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేశారని అధికారులు తెలిపారు. దీనిపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశామని జీవీఎంసీ అధికారులు తెలిపారు. జనసేన పార్టీ కార్పొరేటర్ ఫిర్యాదు అనంతరం అధికారులు చర్యలు చేపట్టారు.


వారం లోపు సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి జోన్ 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేరుతో నోటీసులు అంటించారు. కార్యాలయంలో ఎవ్వరూ లేకపోవడంతో అధికారులు గోడకు నోటీసు అంటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, అధికారులు నోటీసులు అంటించిన కాసేపటికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్కడికి చేరుకున్నారు.


గోడకు అంటించిన నోటీసును తీసుకున్నారు గుడివాడ అమర్నాథ్. తాము నిబంధనలకు అనుగుణంగానే పార్టీ కార్యాలయాన్ని నిర్మించామని మీడియా ప్రతినిధులతో ఆయన అన్నారు. తాము చట్టపరంగా పోరాడతామని చెప్పారు.


గంటల వ్యవధిలోనే ఫైల్‌కు కదలిక


వైసీపీ విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయం ప్లాన్ అనుమతి కోసం వీఎంఆర్డీఏకి 525 రోజుల కిందట దరఖాస్తు చేశారు. ఇందుకోసం రూ.10,000 చెల్లించారు. కారణమేంటో గానీ.. ఇన్నాళ్లుగా ఇది పెండింగ్‌లోనే ఉంతి. రెండు రోజుల కిందట (జూన్ 20) ఈ ఫైల్‌కు అకస్మాత్తుగా కదలిక వచ్చింది. మధురవాడ జోన్-2 సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి ఎండాడలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం దగ్గరకు వెళ్లారు. భవన నిర్మాణాలకు ప్లాన్ ఉందా? లేదా? అని ఆరా తీశారు. 525 రోజులుగా ఈ భవనాల ప్లాన్ ఫైల్ వీఎంఆర్డీఏలో పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.


జూన్ 20న రూ.14 లక్షలు చెల్లించారు వైసీపీ నేతలు. ఎన్టీపీ లాగిన్ నుంచి అదే రోజు రాత్రి 7.27 గంటలకు ఫైల్ ముందుకు కదిలింది. వీఎంఆర్డీఏ టౌన్ ప్లానింగ్‌లోని మరో ఉద్యోగి లాగిన్‌కు చేరింది. ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం 3.57 గంటలకు మరో ఉద్యోగి లాగిన్‌కు వెళ్లగా, అక్కడ 19 నిమిషాల్లో దస్త్రానికి ఆమోదముద్ర వేసి, పైఅధికారులకు పంపినట్టు గుర్తించారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీఎంఆర్డీఏ టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు నిలిపివేశారు. జీవీఎంసీ తాజాగా ఈ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com