ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ చరిత్రలో తొలిసారి, సాధ్యం కాదన్నది చేసి చూపించారు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 08:03 PM

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పింఛన్ల పంపిణీలో ఓ రికార్డు నమోదైంది.. ఒక్క రోజు (సోమవారం)లో 95శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం రికార్డ్‌ను సృష్టించింది. సోమవారం రాత్రి 10 గంటలకల్లా 61.95 లక్షల మందికి (95.05 శాతం) పింఛన్‌ పంపిణీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డు అని.. ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. మిగిలిన వారికి మంగళవారం వారి ఇళ్ల వద్దే నగదు అందించనున్నట్లు తెలిపారు.


గత ప్రభుత్వం హయాంలో 2.65లక్షల మంది వాలంటీర్లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా పింఛన్ పంపిణీ జరగలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2.65మంది వాలంటీర్లు ఉన్నా ఒక్క రోజులో పంపిణీ చేసింది కేవలం 88శాతం మాత్రమే అని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో అత్యధికంగా 97శాతం ఫించన్ల పంపిణీ పూర్తి చేశారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 91శాతం పింఛన్ పంపిణీ పూర్తయ్యింది. ఉదయం 6 గంటల నుంచి 1.30లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీ ప్రారంభించారు.


ఏపీలో పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎవరూ చేయలేనిది, చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయం అన్నారు. గత ప్రభుత్వంలో 2.65లక్షల మంది వాలంటీర్లు ఉన్నా ఈ స్థాయిలో ఎప్పుడూ పింఛన్ల పంపిణీ జరగలేదని.. 1.30లక్షల మంది సచివాలయ సిబ్బందితో ఈ రికార్డు సాధించడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం రెండు నెలలపాటు ఉద్దేశపూర్వకంగానే పింఛన్ పంపిణీ ఆపేసిందని.. వాలంటీర్లు లేకుండా పంపిణీ సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కొంతమంది వృద్ధులు చనిపోయారని.. కానీ చంద్రబాబు చిత్తశుద్ధి, ఉద్యోగుల కష్టంతో ఈ రికార్డ్ సాధ్యమైందన్నారు.


మొత్తం 28 కేటగిరీల్లో ఒక్కరోజులోనే పింఛన్లను పంపిణీ చేశామన్నారు మంత్రి సారథి. గత ప్రభుత్వం ఐదేళ్లకు రూ.వెయ్యి పెంచితే.. చంద్రబాబు 17రోజుల‌ పాలనలోనే వెయ్యి పెంచి రూ.4వేలు చేశారన్నారు. గతంలో పింఛన్‌ను రూ.200నుంచి‌ రూ.2000లకు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు నిబద్ధతతో పని చేశారని.. వారి కష్టం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదో ఒక అరుదైన ఘట్టమన్న మంత్రి.. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తారన్నారు పార్థసారథి.


ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీ పెద్ద వివాదాస్పద అంశం అయ్యింది. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల దగ్గరే డబ్బులు అందించాలని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.. కానీ సీఎస్ అది సాధ్యంకాదని చెప్పారు. అయితే ఎండల సమయంలో పింఛన్ కోసం వచ్చి 33మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేసినా.. పింఛన్ లబ్ధిదారులకు కష్టాలు తప్పలేదు. అయితే కూటమి ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా.. సచివాలయాల సిబ్బంది ద్వారానే లబ్ధిదారులకు ఇళ్ల దగ్గర పింఛన్లు పంపిణీ చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com