ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గగన్‌యాన్ ద్వారా అంతరిక్షంలోకి మోదీ వెళ్తారా? ఇస్రో చీఫ్ సోమనాథ్ సమాధానం ఇదే

national |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 09:41 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’కు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్.. ఈ మిషన్‌కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని స్వదేశీ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపుతారా? అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘గగన్‌యాన్‌’ మిషన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధాని కూడా అక్కడికి వెళ్లొచ్చని బదులిచ్చారు. మన దేశాధినేతను రోదసీలోకి పంపించగలిగే శక్తిసామర్థ్యాలు సమకూర్చుకుంటే మనందరికీ ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.


‘గగన్‌యాన్‌ ద్వారా ముఖ్యమైన వ్యక్తులను పంపడం ప్రస్తుత దశలో సాధ్యం కాదు. చాలా నైపుణ్యం అవసరమైన ఈ మిషన్‌‌లో భాగస్వామ్యం కావాలంటే నెలలు, ఏళ్ల తరబడి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.. ప్రధాని మోదీ వంటి నేతలకు ఎన్నో కీలక బాధ్యతలు ఉంటాయి.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే వ్యోమగాములకు ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోంది’ అని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. మన ప్రభుత్వాధినేత స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి అడుగు పెట్టడమనేది మనందరికీ ఎంతో గర్వకారణమని, గగన్‌యాన్‌ ద్వారా ఆ సామర్థ్యాలను పొందగలమనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు.


ఇక, గగన్‌యాన్‌ మిషన్‌ ఈ ఏడాది కీలక దశలో ఉందని, మూడు ముఖ్యమైన ప్రయోగాలు చేపట్టనున్నామని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. ‘ముందుగా వ్యోమగాములు ఒకరోజు అంతరిక్షంలోకి వెళ్లి.. కక్ష్యలో కొద్దిసేపు గడిపి, తిరిగి భూమికి చేరుకోవాలి... రెండోది పరికరాలు, అల్గారిథమ్‌ పరీక్షలు నిర్వహించాలి. అనంతరం మూడో దశలో లాంచింగ్ ప్యాడ్‌ను పరీక్షించాలి.. మొత్తంగా వచ్చే ఏడాది చివరి నాటికి మొదటి ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు.


మరోవైపు,‘గగన్‌యాన్‌’ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు రోదసీలోకి వెళ్లి.. మూడు రోజుల తర్వాత భూమి మీదకు తిరిగి వస్తారు. ఈ మిషన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాములను ప్రధాని మోదీ పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ శుభాన్షు శుక్లాలను ఎంపిక చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com