ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టార్గెట్ 2026 ప్రపంచకప్.. జింబాబ్వే టూర్‌కు బయల్దేరిన యువ భారత్

sports |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 10:07 PM

శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఓ పక్క సీనియర్ టీమ్.. టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ సాధించిన జోష్‌లో ఉండగానే.. యువ భారత్ జింబాబ్వేకు పయనమైంది. జూలై 6 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కోసం భారత జట్టు మంగళవారం దిల్లీ నుంచి జింబాబ్వేకు బయలుదేరింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ పంచుకుంది.


ప్రస్తుతం టీమిండియాకు ప్రధాన కోచ్ లేడు. టీ20 ప్రపంచకప్ 2024తో ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. నూతన కోచ్ ఎంపిక శ్రీలంకతో సిరీస్ వరకు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వే పర్యటనలో కోసం చీఫ్ కోచ్ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పగించారు. యువ ఆటగాళ్లతో పాటు లక్ష్మణ్ కూడా జింబాబ్వేకు పయనమయ్యాడు.


సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు టీ20లకు రిటైర్మెంట్ పలికిన నేపథ్యంలో జట్టులో సుస్థిర స్థానం సంపాదించేందుకు యువ ఆటగాళ్లకు ఈ సిరీస్‌తో మంచి అవకాశం లభించింది. అయితే ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో నలుగురు ఓపెనర్లు ఉండటం గమనార్హం. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, యశస్వి జైశ్వాల్‌లో ఓపెనింగ్ బెర్తుల కోసం పోటీ పడుతున్నారు. అందులో గిల్, జైశ్వాల్‌లు ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ఇక టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఎంపిక చేసిన ప్రధాన జట్టు, రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో ఉన్న సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్, శివమ్ దూబె, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్‌లు సైతం త్వరలో జింబాబ్వేలో అడుగుపెట్టనున్నారు. జులై 6న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. జూలై 7, జులై 10, 13, 14 తేదీల్లో మగతా నాలుగు టీ20 మ్యాచులు జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.


జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టు:


శుభ్‌మన్ గిల్ (కెప్టెన్, యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుశార్ దేశ్‌పాండే, శివమ్ దూబె






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com