ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీలో పెను విషాదం.. ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 27 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 08:31 PM

ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుని.. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు సహా మహిళలు ఉన్నారు. భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఒక్కసారిగా భక్తులు ఎగబడటంతో తొక్కిసలాటకు దారితీసింది. తోపులాట జరిగి పదుల సంఖ్యలో ఊపిరాడక చనిపోయారు. ఈ ఘటనలో మరో 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడినవారిలో 15 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.


స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో తమవారి మృతదేహాలను చూసి బంధువులు, కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదం అలముకుంది. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించిన ఆయన.. కమిటీ ఏర్పాటుచేయాలని సూచించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


‘‘హత్రాస్‌ జిల్లాలో జరిగిన దురదృష్టకరం ఘటనలో ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం.. హృదయవిదారకం.. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.. వీలైనంత తర్వగా సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించాం.. ఇప్పటికే మంత్రులు లక్ష్మీనారాయన్ చౌధురి, సందీప్ సింగ్‌లు అక్కడకు బయలుదేరారు.. సీఎస్‌, డీజీపీలను కూడా ఘటనా స్థలికి వెళ్లాలని ఆదేశించాం.. ఆగ్రా ఏడీజీ నేతృత్వంలోని కమిషన్‌ను విచారణకు ఏర్పాటు చేశా.. చనిపోయినవారికి శ్రీరాముడి పాదాల చెంతకు చోటు కల్పించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.’’ అని యోగి పేర్కొన్నారు.


ఎటావా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమేశ్ కుమార్ త్రిపాఠీ మాట్లాడుతూ.. ‘మేము ఇప్పటి వరకూ 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 25 మహిళలు (ముగ్గురు చిన్నారులు), ఇద్దరు పురుషులు ఉన్నారు.. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాం.. సత్సంగ్‌‌కు హాజరైన సమయంలో తొక్కిసలాట జరిగినట్టు సమాచారం వచ్చింది.. కానీ, పూర్తి వివరాలు తెలియరాలేదు’ అని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి హాజరైన ఓ మహిళ మాట్లాడుతూ.. స్థానిక ఆధ్యాత్మిక గురువు గౌరవార్దం ఈ సత్సంగ్ నిర్వహించారని తెలిపారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులు వెనుదిరిగిన సమయంలో తొక్కిసలాట జరిగిందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com