ఈనెల 11న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడని అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వై.సోంబాబు సోమవారం తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి మండలం బవులవాడ రిక్షా కాలనీకి చెందిన గొర్లి మహలక్ష్మినాయుడు (73) ఈనెల 11న సాయంత్రం 5.30 గంటలకు తుమ్మపాల గ్రామానికి కూరగాయలు కొనుగోలు చేసేందుకు సైకిల్పై వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో ప్రధాన రోడ్డు దాటుతుండగా అనకాపల్లి నుంచి చోడవరం వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో మహలక్ష్మినాయుడు తలకు తీవ్రంగా గాయమవడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడని అతని కుమారుడు గొర్లి నరసింగరావు ఫిర్యాదు చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ సోంబాబు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతుడికి భార్య బుల్లమ్మ ఉంది.
![]() |
![]() |