విశాఖపట్నం జిల్లా, జీకేవీధి మండలం సీలేరు పంచాయతీ పరిధిలోని పార్వతీనగర్ గ్రామాన్ని ఖాళీ చేయాలంటూ ఏపీ జెన్కో అధికారులు తమను వేధిస్తున్నారంటూ ఆ గ్రామానికి చెందిన గిరిజనులు గురువారం స్థానిక సర్పంచ్ దుర్జో, ఎంపీటీసీ సభ్యుడు పిల్లా సాంబమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారికి వినతి పత్రం అందజేశారు. తాము గిరిజన జాతికి చెందిన కోందులమని, తాము గత 15 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి పార్వతీనగర్ గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని సీలేరులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. 15 సంవత్సరాల క్రితం ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్న సమయంలో కూడా అటవీశాఖ అధికారులు కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికీ స్థానిక నాయకులు, అప్పటి జీకేవీధి తహసీల్దార్ తమకు అండగా నిలవడంతో ఇప్పటి వరకు ప్రశాంతంగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల ఏపీ జెన్కో అధికారులు వచ్చి ఈ స్థలం వారిదని, ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, వారు ఇచ్చిన నోటీసులు తీసుకుని ఈ గ్రామం ఖాళీ చేయాలని పదేపదే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ వినితి పత్రంలో పేర్కొన్నారు. తాము గ్రామం ఏర్పాటు చేసుకున్నప్పుడు గతంలో ఎప్పుడూ ఏపీ జెన్కో అధికారులు ఎటువంటి నోటీసులు గానీ, సమాచారం గానీ ఇవ్వలేదని, కొత్త ప్రాజెక్టు నిర్మాణం కోసం తమను ఖాళీ చేయమంటే ఊరుకునేది లేదని గ్రామస్థులు పేర్కొన్నారు.