ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర క్యాబినెట్‌లో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని.. ధ్రువీకరించిన టీడీపీ మాజీ ఎంపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 09, 2024, 07:25 PM

ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో మోదీ క్యాబినెట్‌లో ఈసారి ఎవరికి చోటు దక్కుతుందనే ఆసక్తి నెలకుంది. అయితే, ఎన్డీయేలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన టీడీపీకి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ఇప్పటికే ఇద్దరి మంత్రి పదవులు ఖాయమైనట్టు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రివర్గంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మంత్రిపదవి దక్కింది. ఈ మేరకు గల్లా జయదేవ్ వారి ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.


‘ఎన్డీయే కొత్త ప్రభుత్వంలో కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవి దక్కినందుకు నా మిత్రుడు రామ్మోహన్ నాయుడికి శుభాకాంక్షలు.. మీ చిత్తశుద్ధి, నిరాడంబరత దేశాభివృద్ధికి నిశ్చయంగా తోడ్పడతాయి. కొత్త పాత్రను సమర్ధవంతంగా పోషించాలని కోరుకుంటున్నాను’ అని గల్లా ట్వీట్ చేశారు. ‘కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న పెమ్మసాని చంద్రశేఖర్‌కు శుభాకాంక్షలు.. మీ తొలి రాజకీయ ప్రస్థానంలో కేంద్ర స్థాయిలో దేశానికి సేవ చేయడం చాలా గౌరవం. గుంటూరుతో పాటు మొత్తం ఏపీ ప్రజలు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారు. మీ కొత్త పాత్రకు న్యాయం చేసి సానుకూల మార్పులను తీసుకొచ్చి, అర్ధవంతమైన ప్రభావాన్ని చూపండి’ అని గల్లా ఆకాంక్షించారు.


కాగా, కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడు తండ్రి ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్ఆర్సీపీ గాలి వీచినా ఆయన మాత్రం విజయం సాధించారు. రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు 1996లో కేంద్రంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచినా.. కేంద్రంలో మంత్రిపదవి దక్కించుకోవడం విశేషం.


ఈ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీ.. ఎన్డీయే కూటమిలో బీజేపీ (240) తర్వాత రెండో అతిపెద్ద పార్టీ. ఈ నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణలో మరో రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్‌నాయుడు, చంద్రశేఖర్‌లకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com