శ్రీశైలంలో లోకళ్యాణార్ధం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి ఆలయ ఈవో పెద్దిరాజు , అధికారులు వార్షిక కుంభోత్సవం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలో తొలి విడత సాత్వికబలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాయలు సమర్పించారు. సాయంత్రం శ్రీస్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది. ఈ సందర్బంగా ఆలయద్వారాలు మూసివేస్తారు. అన్నం కుంభరాశిగా పోసి స్త్రీ వేషంలో ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి ఇచ్చి.. తొమ్మిది రకాల పిండివంటలతో మహానివేదన చేస్తారు. తర్వాత రెండో విడత సాత్వికబలి సమర్పణ చేస్తారు. అనంతరం భక్తులను అమ్మవారి నిజరూప దర్శనానికి అధికారులు అనుమతి ఇస్తారు. కాగా శ్రీశైలం క్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతు, పక్షు బలులు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మాడవీధులు, అంకాళమ్మ, పంచమఠాలు, మహిషాసురమర్ధిని ఆలయాల గట్టి బందోబస్తు ఏర్పాలు చేశారు. ఈరోజు సుండిపెంటలో మద్యం దుకాణాలు నిలిపివేసేలా జిల్లా కలెక్టర్ను కోరినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.